వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలి : అద్దంకి దయాకర్

వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలి : అద్దంకి దయాకర్

ఉదయపూర్ డిక్లరేషన్ ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అధిష్టానానికి తెలియజేశామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. రాజకీయ, పార్టీ పదవులు, రాజ్యాంగ పదవుల్లో న్యాయం చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి గల కారణాలపై చర్చించామని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఢిల్లీ పర్యటనకు వచ్చామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేసేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు. 

రాష్ట్రంలో రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, బీసీలకు రాజకీయ పదవులతో పాటు, వచ్చే ఎన్నికల్లో 50% సీట్లు కేటాయించాలని అడిగామని అద్దంకి దయాకర్ చెప్పారు. ధరణి వల్ల తెలంగాణలో దళితులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ధన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు లాభం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీనేనని, భారత్ జోడు యాత్ర సందేశాన్ని ప్రతి గల్లి గల్లికీ తీసుకెళ్తామన్నారు.