బిజినెస్ డెస్క్, వెలుగు : మన దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ల నెంబర్ ఆగస్టు నెలాఖరు నాటికి 75 కోట్ల మార్కును దాటేసింది. ఇంటర్నెట్ సర్వీస్ మొదలై ఇప్పటికి 25 ఏళ్లయ్యింది. మార్చి 2016 నాటికి కేవలం 34 కోట్లున్న ఇంటర్నెట్ కనెక్షన్లు ఆ తర్వాత నాలుగేళ్లలో శరవేగంతో రెట్టింపవడం విశేషం. 75 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లలో ఎక్కువ భాగం అర్బన్ ఏరియాలలోనే ఉన్నాయి. వైర్లెస్ డివైస్లు, మొబైల్ ఫోన్లు, డాంగిల్స్ను పట్టణాలు, సిటీలలోనే ఎక్కువగా వాడుతున్నారు. ట్రాయ్ డేటా ప్రకారం జూన్ 2020 నాటికి మొత్తం 74.9 కోట్ల ఇంటర్నెట్ యూజర్లున్నారు. ఇందులో 5 కోట్ల మంది నారోబ్యాండ్ యూజర్లయితే, 69.2 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు. ఆగస్టు చివరి నాటికి చూస్తే బ్రాడ్బ్యాండ్ యూజర్ల నెంబరే 71 కోట్లను మించింది. నారోబ్యాండ్ కనెక్షన్ల సంఖ్యలో మార్పులేదనుకున్నా, మొత్తం యూజర్ల సంఖ్య ఆగస్టు చివరకు 76.7 కోట్లను దాటేసింది. సెప్టెంబర్ 2018లో ఇండియాలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అందుకుంది. ఆ తర్వాత ప్రతి నెలా చూస్తే సుమారు 86 లక్షల కొత్త కనెక్షన్లు యాడ్ అయినట్లు.
జూన్ 2020 నాటి దాకా చూస్తే మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్లలో 61 శాతం అర్బన్ ఏరియాలలోనే ఉన్నాయి. ఇందులో 97 శాతం వైర్లెస్ కనెక్షన్లే. 97 శాతం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు మొబైల్స్ పైనే ఉన్నా, దేశంలోని జనాభాకు సరిపడినంత కవరేజ్ లేదని, ఇది 50 శాతమేనని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ ఎస్ పీ కొచ్చర్ చెప్పారు. మొబైల్ నెట్వర్క్ ఇంకా విస్తరించాలని, అందుబాటు ధరలలో ఉంటూనే మెరుగైన క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. టెలికం సెక్టార్ మరిన్ని ఇతర సెక్టార్లకు ఊతమిస్తోందని కొచ్చర్ అన్నారు. అందుకే ఈ సెక్టార్ను ఫౌండేషనల్ సెక్టార్గా ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. కేవలం ఆదాయం తెచ్చి పెట్టే ఒక వనరుగా మాత్రమే టెలికంను చూడటం సరికాదని చెప్పారు. టెలికం రంగం వల్ల ఇతర రంగాలలో ఎంత ఆదాయం వస్తోందో కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
కనీస అవసరంగా ఇంటర్నెట్….
ట్రయల్ బేసిస్ మీద డేటాకు మినిమం ఫ్లోర్ ప్రైస్ను ఫిక్స్ చేయాలని ట్రాయ్కు సీఓఏఐ ప్రతిపాదించింది. అయితే, దీనిపై ఓపెన్ హౌస్ డిస్కషన్ పెడతామని ట్రాయ్ చెప్పింది. స్పెక్ట్రమ్ ఛార్జీలను మరోసారి పరిశీలించాలని, బరువుగా మారిన మరి కొన్ని ఫీజులు, ఛార్జీలను కూడా పరిశీలించాలని ప్రభుత్వాన్ని సీఓఏఐ కోరుతోంది. ఇంటర్నెట్ వేగంగా విస్తరించడం వల్లే కరోనా మహమ్మారి టైమ్లోనూ చిన్న బిజినెస్లు సజావుగా వ్యాపారం చేసుకోగలిగాయని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ– బెంగళూరు (ఐఐటీ–బీ) ప్రొఫెసర్ దేబబ్రత దాస్ తెలిపారు. ఎడ్యుకేషన్, ఫైనాన్స్, హెల్త్కేర్ వంటి రంగాలలో యాక్సెస్కు ఇంటర్నెట్ బాగా సాయపడుతోందన్నారు. నిజానికి ఇంటర్నెట్ ఇవేళ కనీసావసరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చన్నారు.
ఆరు రాష్ట్రాల్లో 26 కోట్ల కనెక్షన్లు…
కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర …ఈ ఆరు రాష్ట్రాలలోనూ కలిపి 26 కోట్ల ఇంటర్ నెట్ కనెక్షన్లు (35 శాతం) ఉన్నాయి. జూన్ చివరి నాటి డేటా ప్రకారం రిలయన్స్ జియో ఎక్కువ మార్కెట్ వాటాతో మొదటి ప్లేస్లో నిలుస్తుండగా, ఆ తర్వాత ప్లేస్లలో ఎయిర్టెల్, వొడాఫోన్లు ఉన్నాయి. దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 75 కోట్లు దాటినంత మాత్రాన, అన్ని కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పలేం.
Read more news…