- మేయర్ అభ్యర్థి షెల్లీ పిటిషన్ నేడు విచారించనున్న కోర్టు!
న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక రెండు సార్లు వాయిదాపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మేయర్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు సభ నిర్వహించినప్పుడల్లా కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోపు మేయర్ను ఎన్నుకునేలా ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే వాయిదా పడగా మేయర్ ఎన్నికపై మళ్లీ సభ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లారిటీ ఇవ్వలేదన్నారు. కావాలనే ఎన్నికను బీజేపీ అడ్డుకుంటోందని ఒబెరాయ్, లీడర్ ఆఫ్ హౌస్ ముఖేశ్ గోయల్ పిటిషన్లో వివరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది కౌన్సిలర్లకు ఓటింగ్ అర్హత లేదని, అది చట్టవిరుద్ధమని తెలిపారు. వాళ్లను ఓటింగ్లో పాల్గొనకుండా నిలువరించాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ శుక్రవారం విచారణ కు వచ్చే అవకాశం ఉంది.