న్యూఢిల్లీ: ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీని అడ్డుకోవడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టికేషన్(సీబీఐ) చర్యలు ప్రారంభించింది. ఆన్లైన్లో పిల్లలను లైంగికంగా వేధిస్తున్న, చైల్డ్ పోర్నోగ్రఫి, పిల్లల అబ్యూసివ్ వివరాలు పోస్ట్ చేస్తున్న 83 మందిని ప్రాథమికంగా గుర్తించింది. నవంబర్14న వారిపై వేర్వేరు కేసులు నమోదు చేసిన సీబీఐ మంగళవారం నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టింది.
దేశవ్యాప్తంగా 76 ప్రాంతాల్లో..
చిన్నారుల పోర్న్ వీడియోలను చూడటం, డౌన్లోడ్, అప్లోడ్ చేయడం లాంటివి చట్టరీత్యా నేరం. కాగా చైల్డ్ పోర్నోగ్రఫి సర్క్యులేట్చేస్తున్న 83 మంది నిందితుల కోసం సీబీఐ అధికారులు మంగళవారం దేశవ్యాప్తంగా14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఏపీ, ఢిల్లీ, యూపీ, పంజాబ్, బిహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు సీబీఐ ప్రతినిథి ఆర్సీ జోషి తెలిపారు.