- సీక్రెట్గా చేర్చిన చైనీస్ హ్యాకర్లు
- దానితో మిలిటరీ బేస్లకు, ఇండ్లకు కరెంట్ కట్ చేయొచ్చు
- న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం
న్యూయార్క్: అమెరికా మిలిటరీ నెట్ వర్క్లోకి చైనీస్ హ్యాకర్లు ఒక సీక్రెట్ మాల్వేర్ ను చొప్పించారని, ఆ మాల్వేర్ను గుర్తించేందుకు అమెరికన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శనివారం ఓ కథనంలో వెల్లడించింది. అమెరికాలోని పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్ వర్క్లను ఆ మాల్వేర్తో చైనా కంట్రోల్ చేసే అవకాశం ఉందని.. అదే గనక జరిగితే కీలకమైన మిలిటరీ బేస్లకు కరెంట్, వాటర్ సప్లైకి ఆటంకం కలుగుతుందని తెలిపింది. కమ్యూనికేషన్ వ్యవస్థలనూ స్తంభింపచేసే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం మిలిటరీ బేస్లకే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణ జనాలకు సైతం కరెంట్, వాటర్, కమ్యూనికేషన్ కట్ అయ్యేలా ఈ మాల్వేర్తో కంట్రోల్ చేసే చాన్స్ ఉందంటూ అధికారులను ఉద్దేశించి చెప్తున్నారని ఆ పత్రిక వివరించింది.
ఇండో–పసిఫిక్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా తైవాన్ కు అమెరికా మద్దతిస్తున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఘర్షణలు పెరిగితే.. చైనా హ్యాకర్లు అమెరికాపై ఈ మాల్వేర్తో ప్రతాపం చూపుతారన్న ఆందోళనలు నెలకొన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ అధికారి ఒకరు ఈ మాల్వేర్ను ‘టైమర్ ఆన్ చేసిన టైం బాంబు’గా పోల్చారని తెలిపింది. కాగా, చైనాలో అమెరికన్ అంబాసిడర్ నికోలస్ బర్న్స్ ఈమెయిల్ అకౌంట్ను చైనా హ్యాకర్లు హ్యాక్ చేశారని వారం కిందట సీఎన్ఎన్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది.