రాష్ట్రంలో చాలా అడవులు నాశనమయ్యాయని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో చెట్లను ఓ ప్రణాళికబద్దంగా పెంచాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశపెట్టిన హరితహారం పథకాన్ని యూఎన్ఓ ప్రశంసించిందని కేసీఆర్ తెలిపారు. హరితహారాన్ని నిరంతరం కొనసాగించాలంటే ప్రత్యేకంగా నిధిని సమకూర్చాలని కేసీఆర్ అన్నారు. అందుకోసం తెలంగాణ గ్రీన్ ఫండ్ను తీసుకొస్తామని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ ఫండ్ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ వంతుగా ఆర్థికసాయం చేయాలని సీఎం కోరారు. ఈ ఫండ్ సేకరణ గురించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని.. సూత్రప్రాయంగా మాత్రమే చెప్పానని ఆయన తెలిపారు.
ఈ గ్రీన్ ఫండ్ కోసం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల జీతం నుంచి నెలకు రూ.100 కట్ చేయాలని అనుకుంటున్నట్లు ఆయా సంఘాల అధ్యక్షులతో మాట్లాడామని.. అందుకు వారు ఒప్పుకున్నారని సీఎం తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి నెలకు రూ. 25 చెల్లించాలని ఆయా సంఘాల నాయకులతో మాట్లాడి ఒప్పించామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి నెలకు రూ. 500 చెల్లించాలని కోరాం. అందుకు టీఆర్ఎస్ సభ్యులందరూ సమ్మతం తెలిపారన్నారు. విపక్ష నేతలు కూడా ఈ ఫండ్ గురించి ఆలోచించి సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎవరెవరి నుంచి ఎంత ఫండ్ అంటే..
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల జీతం నుంచి నెలకు రూ.100.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి నెలకు రూ. 25.
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి నెలకు రూ. 500.
- ట్రేడ్ లైసెన్స్ల రెన్యూవల్ కోసం వచ్చే వాళ్ల నుంచి ఏడాదికి రూ. 1000
- భూముల రిజిస్ట్రేషన్కు వచ్చిన వారి నుంచి రూ. 50 (రాష్ట్రంలో ప్రతి రోజు సుమార్ 8 వేల రిజిస్ట్రేషన్లు)
అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి..
- స్కూల్ విద్యార్థుల నుంచి రూ. 5
- హైస్కూల్ విద్యార్థుల నుంచి రూ. 15
- ఇంటర్ కాలేజీ విద్యార్థుల నుంచి రూ. 25
- డిగ్రీ కాలేజీ విద్యార్థుల నుంచి రూ. 50
- ప్రొఫెషనల్, మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి రూ. 100
For More News..