
అహ్మదాబాద్: వెస్టిండీస్ తో లిమిటెడ్ ఓవర్ల సిరీస్కు ముందు ఇండియా టీమ్ లో కరోనా కలకలం సృష్టించింది. నలుగురు ప్లేయర్లు సహా ఏడుగురు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని ఓ హోటల్లో క్వారంటైన్ లో ఉన్న టీమిండియా ప్లేయర్లు శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ తో పాటు స్టాండ్బై ప్లేయర్ నవదీప్ సైనీ, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్, టీమ్ సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లోకేశ్ పాజిటివ్గా తేలారు. దీంతో వీరిని ఐసోలేషన్ లో ఉంచారు. సోమవారం చేసిన టెస్టుల్లో ధవన్, సైనీ, దిలీప్, లోకేశ్కు, మంగళవారం రుతురాజ్, బుధవారం నాటి టెస్టుల్లో శ్రేయస్, రాజీవ్కు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను వన్డే టీమ్లో చేర్చినట్టు తెలిపింది. కరోనా బారిన పడ్డ వాళ్లంతా వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు. నెగిటివ్ గా తేలిన తర్వాత మళ్లీ టీమ్ తో కలుస్తారు. అవసరం అయితే స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న సాయి కిశోర్, రిషి ధవన్, షారుక్ ఖాన్ మెయిన్ టీమ్లోకి తీసుకునే చాన్సుంది. ఇండియా–విండీస్ మధ్య 6న తొలి వన్డే జరగనుంది. ఇది ఇండియాకు 1000వ వన్డే కావడం విశేషం. మరోవైపు వన్డే, టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ టీమ్ బుధవారం అహ్మదాబాద్ లో ల్యాండ్ అయింది.