- ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు చాన్స్
- ఆందోళనలో ఎఫ్డీ హోల్డర్లు
- బకాయిల చెల్లింపులు కష్టమే
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీలు)లో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు భయంతో వణుకుతున్నారు. ఈ కంపెనీ అక్రమంగా నిధులు మళ్లించిందని, మోసాలకు పాల్పడ్డదనే ఆరోపణలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఏ క్షణంలోనైనా దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధులను మళ్లించారని కేపీఎంజీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ తేల్చడమే ఇందుకు కారణం. దీంతో డీహెచ్ఎఫ్ఎల్ రిజల్యూషన్ ప్లాన్ కూడా అమలయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు మొదలైతే ఎఫ్డీలు సహా అన్ని రకాల చెల్లింపులను కంపెనీ నిలిపివేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ కంపెనీకి రూ.38,342 కోట్ల వరకు అప్పులు ఇచ్చాయి. వీటికి కూడా రీపేమెంట్లు చేయడం సాధ్యపడదు. డిపాజిటర్లతోపాటు బ్యాంకులకూ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డెట్ రీకాస్ట్ ప్లాన్ ప్రకారం బ్యాంకుల వంటి లెండర్లను డీహెచ్ఎఫ్ఎల్లో 51 శాతం వాటా తీసుకున్నారు. కంపెనీ అప్పులో కొంత మొత్తాన్ని ఈక్విటీగా మార్చారు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈ ప్లాన్ అమలు తుదిదశకు చేరుకుంది. కోర్టు తీర్పులు, ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల ఈ ప్లాన్ మూలనపడింది. డీహెచ్ఎఫ్ఎల్ ఎఫ్డీ ఇన్వెస్టర్లలో అత్యధికులు రిటైర్డ్ ఎంప్లాయిస్. ఎన్నో ఏళ్లు శ్రమించి సంపాదించిన డబ్బును డీహెచ్ఎఫ్ఎల్ చేతిలో పెట్టారు. రూల్స్ ప్రకారం కంపెనీ వీరికి మొదట డబ్బు చెల్లించాలి. ఈ ఏడాది జూలై ఆరో తేదీ నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం దీని దగ్గర రూ.6,188 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తమ అనుమతి లేకుండా ఎవరికీ డబ్బులు చెల్లించొద్దని హైకోర్టు కూడా డీహెచ్ఎఫ్ఎల్ను ఆదేశించింది. అందుకే తాము ఎఫ్డీల డబ్బులు ఇవ్వడం లేదంటూ కంపెనీ డిపాజిటర్లకు ఉత్తరాలు పంపింది. అత్యవసర పరిస్థితులు ఉన్న ఇన్వెస్టర్లకు కూడా డబ్బులు చెల్లించడం లేదు. కనీసం డెట్ రిజల్యూషన్ ప్లాన్ను అమలు చేయాలన్నా, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు పూర్తయ్యేదాకా ఎదురుచూడక తప్పదని ఒక బ్యాంకు సీఈఓ అన్నారు. ఇవి అన్సెక్యూర్డ్ ఎఫ్డీలు కాబట్టి పోలీసులకు లేదా కోర్టుకు ఫిర్యాదు చేసినా, పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని ఫిన్సెక్ లా అడ్వైజర్స్కు చెందిన సందీప్ పరేఖ్ అన్నారు.

