అలిగిన వారికి బుజ్జగింపులు..పరిస్థితులు చక్కదిద్దాలని కేటీఆర్​ ఆదేశం

అలిగిన వారికి బుజ్జగింపులు..పరిస్థితులు చక్కదిద్దాలని కేటీఆర్​ ఆదేశం

కౌన్సిలర్లతో ముఖ్య నేతల చర్చలు
కామారెడ్డిపై ఇక నుంచి కేటీఆర్​స్పెషల్​ ఫోకస్​​

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో గులాబీ నేతల మధ్య గుప్పుమన్న విభేదాలపై ఆ పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్​ ఫోకస్​పెట్టారు. మంత్రి ఆదేశంతో స్థానిక లీడర్ల మధ్య ఉన్న విభేదాలను చక్కబెట్టడానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. నిధుల కేటాయించడం లేదని, హైదరాబాద్​లో జరిగిన మీటింగ్​కు సైతం తమను పిలవకుండా వివక్ష చూపారని బుధవారం కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. వారితో గురువారం నియోజకవర్గ ఇన్​చార్జి శేరి సుభాష్​రెడ్డితో పాటు మరికొందరు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. మీటింగ్​కు పిలవకపోవడమే కాకుండా, తమ వార్డులకు ఫండ్స్ కేటాయించడం లేదని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. కొందరు కౌన్సిలర్లకే అధిక ప్రియారిటీ ఇస్తున్నారని వాపోయారు.

అందరు కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని, ఏమైనా సమస్యలుంటే  కేటీఆర్ ​దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సుభాష్​రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము ప్రస్తుతమున్న టౌన్​ లీడర్లతో పని చేయమని, తమ వార్డుల్లో మాత్రమే పనిచేస్తామని, అవసరమయితే ఎవరినైనా కొత్తవారిని తమకు ఇన్​చార్జిగా పెట్టండని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. త్వరలోనే కేటీఆర్​తో భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తానని కౌన్సిలర్లకుక సుభాష్​రెడ్డి హామీ ఇచ్చారు.

విస్తృత స్థాయి సమావేశంలోనూ..

కామారెడ్డి నుంచి కేసీఆర్​ పోటీ చేస్తున్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 7న నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల మీటింగ్​ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్​ దిశానిర్దేశం చేశారు. బుధవారం కూడా పార్టీ ముఖ్య లీడర్లతో హైదరాబాద్​లో సమావేశమయ్యారు. మండలాలవారిగా పార్టీ పరిస్థితి, ప్రతిపక్షాల స్టేటస్​ను కేటీఆర్ ​క్షుణ్నంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతల మధ్య అంతర్గత కలహాలు, విభేదాలు రివ్యూ మీటింగ్​సందర్భంగా కేటీఆర్​ దృష్టికి వెళ్లాయి.

కొందరు నేతల పనితీరుపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల 7న కామారెడ్డిలో నిర్వహించిన మీటింగ్​సందర్భంగా కూడా ఫ్లెక్సీల్లో ఫొటోల వివాదం కూడా ఇది వరకే మంత్రి దృష్టికి వెళ్లింది. ముఖ్య లీడర్లపై ఫిర్యాదులు రావడంతో కేటీఆర్ సీరియస్​గా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ స్ర్టాంగ్ ​వార్నింగ్​ ఇచ్చారు.