కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. జులై 15 (శుక్రవారం) నుంచి 75 రోజుల పాటు బూస్టర్ డోస్ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దేశంలో గతేడాది జనవరి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండు డోసులు కేంద్రమే ఉచితంగా ఇవ్వగా.. కొంత మంది డబ్బు చెల్లించి మూడో డోస్ను వేయించుకున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బూస్టర్ డోస్ ఫ్రీగా ఇవ్వనున్నారు.
దేశంలో ఇప్పటి వరకు 199 కోట్లకు పైగా డోసుల కరోనా వ్యాక్సిన్ అందజేశారు. నిత్యం 11 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. మూడో డోసు ఫ్రీగా వేయనుండడంతో.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం 15,447 మంది కొత్త ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,32,457 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.