ఎన్టీపీసీకి విస్తరణ కష్టాలు..తెలంగాణ స్టేజ్2 నిర్మాణంలో జాప్యం

ఎన్టీపీసీకి విస్తరణ కష్టాలు..తెలంగాణ స్టేజ్2 నిర్మాణంలో జాప్యం
  • రెండో దశలో 800 మెగావాట్లకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం
  • మూడు యూనిట్ల నిర్మాణంపై సందిగ్ధం

గోదావరిఖని, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టం -2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 4 వేల మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్లనిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ 12 ఏండ్లు అవుతున్నా ఇందులో 1600 మెగావాట్ల విద్యుత్​ మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్ల ఏర్పాటు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

రామగుండం ఎన్​టీపీసీకి చెందిన స్థలంలో రెండు దశల్లో 800 మెగావాట్ల చొప్పున ఐదు యూనిట్ల(మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్​)ను నెలకొల్పాలని నిర్ణయించారు. అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం విద్యుత్​ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) సరైన సమయానికి చేసుకోకపోవడంతో రెండేండ్ల తర్వాత 2016 జనవరిలో ఫస్ట్​ ఫేజ్​ 1,600 మెగావాట్ల(800 మెగావాట్ల రెండు యూనిట్లు) ప్లాంట్​ నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఐదేండ్లలో పూర్తి కావాల్సిన ప్లాంట్​ నిర్మాణానికి వివిధ కారణాల వల్ల ఏడేళ్ల సమయం పట్టింది. అడ్వాన్సుడ్​ ఆల్ట్రా సూపర్​ క్రిటికల్​ టెక్నాలజీతో మొదటి యూనిట్​(800 ఎంవీ) 2023 సెప్టెంబర్​లో, రెండో యూనిట్(800 ఎంవీ) 2024 మార్చిలో నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుత్​ ఉత్పత్తిని ప్రారంభించాయి. మొదటి దశలో మొత్తం 1,600 మెగావాట్ల విద్యుత్​లో 85 శాతం తెలంగాణ రాష్ట్రమే తీసుకుంటున్నది.

800 మెగావాట్లకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఒకే..

ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మించే స్టేజ్​ 2లో మొదటి 800 మెగావాట్ల కరెంటును కొనేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్​ 2న ఎన్టీపీసీ కమర్షియల్​ వింగ్​ ఆఫీసర్లకు, తెలంగాణ రాష్ట్ర ఎన్​పీడీసీఎల్​, ఎస్​పీడీసీఎల్​ ఆఫీసర్లకు మధ్య ఒప్పందం జరిగింది. కానీ స్టేజ్​ 2లో భాగంగా మరో 800 మెగావాట్ల రెండు యూనిట్లకు ఇంకా పవర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​ కావాల్సి ఉంది.

800 మెగావాట్ల రెండో యూనిట్​ విద్యుత్​ను కొనాలని ఎన్టీపీసీ యంత్రాంగం పంజాబ్​, కర్నాటక, గుజరాత్​ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాలు ఈ 800 మెగావాట్ల విద్యుత్​ను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే ఇక మిగిలిన మరో 800 మెగావాట్ల విద్యుత్​ను డిమాండ్​కు అనుగుణంగా ఏ రాష్ట్రానికైనా విక్రయించేందుకు ఎన్టీపీసీ సిద్దంగా ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల నుంచి విద్యుత్​ కొనుగోలు ఒప్పందంపై స్పష్టత రాలేదు. 
మొదలు కాని స్టేజ్​ 2 పనులు..
ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్​ 2 నిర్మాణ బాధ్యతలు భారత్​ హెవీ ఎలక్ట్రికల్​ లిమిటెడ్(బీహెచ్​ఈఎల్​)కే దక్కాయి. ఈ ఏడాది మార్చి 29న ఎన్టీపీసీ సంస్థ నోటిఫికేషన్​ ఆఫ్​ ఆవార్డు ద్వారా బీహెచ్​ఈఎల్​కు ప్లాంట్​ నిర్మాణ పనులు అప్పగిస్తూ లెటర్​ రాసింది. మొదటి యూనిట్​ను 54 నెలల్లో, రెండో యూనిట్​ను 58 నెలల్లో, మూడో యూనిట్​ను 62 నెలల్లో నిర్మించాలని ఎన్టీపీసీ సంస్థ సూచించింది. కానీ ఇప్పటి వరకు స్టేజ్​ 2 ప్లాంట్​కు సంబంధించిన పనులు ప్రారంభం కాకపోవడంతో దీని నిర్మాణం విషయంలో సందిగ్ధత  నెలకొంది.

పీపీఏ కోసం పడిగాపులు..


స్టేజ్​ 2లో 800 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లను నిర్మించడానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. అలాగే ఎల్లంపల్లి నుంచి నీరు, సింగరేణి, వెస్ట్రన్​ కోల్​ ఫీల్డ్స్​ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్​) నుంచి బొగ్గు రవాణా జరుగుతోంది. ప్లాంట్​ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు 2024లో వచ్చాయి.

ప్లాంట్​ నుంచి వెలువడే బూడిదను నింపడానికి కుందనపల్లి సమీపంలో పాత రాజాపూర్​ వద్ద వెయ్యెకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్​ 2 ప్లాంట్​ కోసం పవర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​ చేసుకోవడం లేదు. బీఆర్​ఎస్​ హాయాంలో స్టేజ్​ 2 నిర్మాణం చేయాల్సి ఉన్నప్పటికీ స్థానికంగా కాకుండా యాదాద్రిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్​ ప్లాంట్​ నెలకొల్పింది. దీంతో ఎన్టీపీసీతో విద్యుత్​ కొనడానికి ఆనాటి ప్రభుత్వం ముందుకు రాలేదు.