న్యూఢిల్లీ : ఆన్లైన్లో షాపింగ్ చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మోసాల బారిన పడకుండా కాపాడేందుకు ఈ–కామర్స్లో "డార్క్ ప్యాటర్న్ల" వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం, కస్టమర్కు తెలియకుండానే కొన్ని ప్రొడక్టులను కార్ట్లో వేయడం, డొనేషన్ పేరుతో కొంత డబ్బు వసూలు చేయడం, సబ్స్క్రిప్షన్ వంటివి అంటగట్టడం వంటి పద్ధతులను డార్క్ ప్యాటర్న్స్అంటారు. "డార్క్ప్యాటర్న్ల నివారణ నియంత్రణ కోసం మార్గదర్శకాలు" అనే గెజిట్ నోటిఫికేషన్ను నవంబర్ 30న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) జారీ చేసింది. ఇది భారతదేశంలోని వస్తువులు, సేవలను అందించే అన్ని ప్లాట్ఫారమ్లకు ప్రకటనకర్తలకు, సెల్లర్లకు కూడా వర్తిస్తుంది.
రూల్స్ను ఉల్లంఘిస్తే వినియోగదారుల రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించింది. డిజిటల్ కామర్స్లో వినియోగదారుల కొనుగోలు ఎంపికలను, ప్రవర్తనను మార్చడం ద్వారా వారిని తప్పుదారి పట్టించడానికి ప్లాట్ఫారమ్లు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. ఉదాహరణకు, 'బాస్కెట్ స్నీకింగ్' అనేది ఒక డార్క్ ప్యాటర్న్. చెక్ అవుట్ సమయంలో కొంత మొత్తాన్ని సేవలకో, ధార్మిక సంస్థలకో చెల్లించాలని అడుగుతారు. వినియోగదారు అనుమతి లేకుండా ఈ మొత్తాలను వసూలు చేస్తారు. "ఫోర్స్డ్ యాక్షన్" అనేది మరో డార్క్ప్యాటర్న్. వినియోగదారు ఏదైనా అదనపు వస్తువులను కొనుగోలు చేయడం లేదా సబ్స్క్రయిబ్ చేయడం లేదా సంబంధం లేని సేవ కోసం డబ్బులు కట్టిస్తారు. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం వంటివి కూడా ఉంటాయి.