ఎస్సైకి మూడు నెలల జైలుశిక్ష.. హైకోర్టు తీర్పు

ఎస్సైకి మూడు నెలల జైలుశిక్ష..  హైకోర్టు తీర్పు

మిర్యాలగూడ, వెలుగు : భూమి పంచాయితీ విషయమై హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించిన ప్రస్తుత నల్గొండ జిల్లా వేములపల్లి మండల ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ కు మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈనెల 1న హైకోర్టు తీర్పు వెలువరించింది. పిటిషనర్ ​ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలోని సర్వే నంబర్ 902లో  2. 12  ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఈ వ్యవసాయ భూమి విషయంలో 2021లో అప్పటి కట్టంగూరు ఎస్ఐగా ఉన్న విజయ్ కుమార్, శాలీగౌరారం సీఐ రాఘవరావు జోక్యం చేసుకున్నారు. ఆ భూమిపై తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించిన అధికార పార్టీ మాజీ సర్పంచ్​ నాగులపాటి  నాగమణికి సహకరించి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు. 

ఇదే విషయమై పలుమార్లు సదరు ఎస్ఐకి, సీఐకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.  ఉద్దేశపూర్వకంగా ఆ ఇద్దరూ కోర్టు ఉత్తర్వులను ఉల్లఘించారని పిటిషనర్​ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్ఐకి మూడు నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. సీఐకి కూడా సీరియస్​ వార్నింగ్​ ఇచ్చింది.