
- ఎకరం పత్తికి రూ.5 వేల ప్రోత్సాహం
- అధిక సాంద్రత పద్ధతి సాగుకు యాదాద్రి జిల్లా ఎంపిక
- తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు
- ఎకరానికి 14.50 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం
- గత సీజన్లోనూ 203 ఎకరాల్లో సాగు
యాదాద్రి, వెలుగు : అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం యాదాద్రి జిల్లాను ఈ సీజన్లో కూడా కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ఎంపిక చేసింది. ఈ పద్ధతిలో పత్తి సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ఎకరానికి రూ.5 వేలు ప్రోత్సాహకంగా కేంద్రం ఇవ్వనుంది. గత వానాకాలంలో ఈ పద్ధతితో పత్తి సాగు చేసిన రైతులకు ఈ నెలాఖరుకు ప్రోత్సాహకం జమ చేయనుంది. అధిక సాంద్రత పద్ధతిలో రైతులు అధిక లాభం పొందవచ్చు.
ఎర్ర భూములు కలిగిన వాళ్లే..
అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి ఎర్రభూములు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఎర్ర భూములు కలిగిన రైతులను కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ఎంపిక చేస్తోంది. 1 నుంచి 5 ఎకరాల్లోపు భూములు కలిగిన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టులో చేరే రైతులు తమ ఫోన్ నంబర్, ఆధార్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కాపీలతోపాటు పూర్తి వివరాలను అందించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది.
విత్తన రకాలు ఇవే..
ఈ ప్రాజెక్టులో చేరిన రైతులకు ఏ ఏ రకమైన విత్తనాలు వాడాలో వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాశి, నూజివీడు, క్రిష్టల్ కంపెనీలకు చెందిన ఆర్సీహెచ్ 929, 971, ఆర్మిత, ఆద్య, సిరి హైబ్రిడ్ విత్తనాలను ఎకరానికి నాలుగు ప్యాకెట్ల చొప్పున ఆయా కంపెనీలు నిర్దేశించిన ధరకు అందిస్తాయి. ఎంపికైన రైతులు పత్తి విత్తే సమయంతోపాటు పంట దిగుబడి వచ్చే వరకు పలుమార్లు శాస్త్రవేత్తలు పత్తి చేన్లను సందర్శించి సలహాలు, సూచనలు ఇస్తారు.
ఎక్కువ సమయం.. తక్కువ దిగుబడి..
రైతులు పత్తిని సాధారణ పద్ధతిలో అంటే 90x60 లేదా 120x60 సెంటి మీటర్ల మధ్య విత్తడం వల్ల ఎకరానికి 6 వేల నుంచి 7,500 మొక్కల వరకు ఏపుగా పెరుగుతాయి. దీనివల్ల ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉంటుంది. దిగుబడి కూడా ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు వస్తుంది. పంట కాల వ్యవధి కూడా 180 రోజులు ఉంటుంది. పైగా గులాబీ రంగు చీడ కారణంగా పెట్టుబడి పెరుగుతోంది.
రెండు విధాలుగా లాభం..
కేంద్ర పత్తి పరిశోధన సంస్థ చేపట్టిన అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతులకు రెండు విధాలుగా లాభం కలగనుంది. ఈ విధానంలో సాగు చేస్తే దిగుబడి వంద శాతం పెరుగుతోంది. దీంతోపాటు కేంద్రం ఎకరానికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం అందుతుంది. 2024–25 సీజన్లో యాదాద్రి జిల్లాలోని 71 మంది రైతులు అధిక సాంద్రత పద్ధతిలో చేరి 203 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. వీరందరి అకౌంట్లలో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఈ నెలాఖరుకు జమ కానున్నాయి.
తక్కువ సమయం.. ఎక్కువ దిగుబడి..
అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేస్తే తక్కువ స్థలం, తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పరిశోధన సంస్థ సూచించిన విధంగా 90x10 లేదా 90x15, 80x20, 75x20 సెంటి మీటర్లుగా విత్తితే ఎకరానికి 30 వేలకు పైగా మొక్కలు పెరుగుతాయి. పంట కాల వ్యవధి కూడా 130 నుంచి 140 రోజులు ఉంటుంది. ఒక్కో మొక్కకు 10 నుంచి 15 కాయలు కాచి, దిగుబడి కూడా ఎకరానికి 14 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పైగా ఈ విత్తనాలకు గులాబీ రంగు చీడ భయం లేదు.
అధిక సాంద్రతతో రైతులకు మేలు
అధిక సాంద్రత పద్దతిలో పత్తి సాగు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతోంది. దిగుబడి ఎక్కవ రావడానికి తోడుగా కేంద్రం కూడా సాయం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో చేరే వారు కలెక్టరేట్లోని తమ కార్యాలయాన్ని నేరుగా సందర్శించాలి. – డాక్టర్ అనిల్కుమార్, శాస్త్రవేత్త, ఏరువాక, యాదాద్రి ఇల్లా