హైదరాబాద్, వెలుగు: పుడ్ ప్రొసెసింగ్, ప్లాస్టిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనుకూలమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. థాయ్లాండ్ డిప్యుటీ ప్రైమ్, కామర్స్ మినిస్టర్ జురిన్ లక్సనావిసిట్ ఆధ్వర్యంలో శనివారం సిటీలో జరిగిన ఇండియా–థాయ్లాండ్ బిజినెస్ మ్యాచింగ్, నెట్వర్కింగ్ సెమినార్కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సెమినార్లో చెన్నైలోని థాయ్లాండ్ కాన్సులేట్ జనరల్ నిటిరూజ్ ఫోనేప్రసర్ట్, థాయ్ వైస్ కామర్స్ మినిస్టర్ సన్సెర్న్ సమలప, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామర్స్ ప్రెసిడెంట్ కరునెండా ఎస్ జస్తి, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఇండియాలో ఉత్పత్తవుతున్న ఫార్మా వ్యాక్సిన్లలో మూడింట ఒకటో వంతు హైదరాబాద్లోనే తయారవుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఫార్మా సెక్టార్లో పెట్టుబడులకు హైదరాబాద్ మంచి వేదికని తెలిపారు.
ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు
ఇండియా–థాయ్లాండ్కు దగ్గర సంబంధం ఉందని, థాయ్ వంటకాలు హైదరాబాద్లో ఫేమస్ అయ్యాయని కేటీఆర్ అన్నారు. ఇండియా టూరిజం ఇండస్ట్రీలో అనేక అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్కు 400 కి.మీ లోనే కృష్ణపట్నం పోర్టు అందుబాటులో ఉందని, ఇక్కడ అతిపెద్ద ఫర్నిచర్ పార్క్ను ఏర్పాటు చేయాలని కోరారు. హౌసింగ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా పేదవాళ్ల కోసం హౌసింగ్ ప్రాజెక్టులను తీసుకొచ్చిందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడానికి థాయ్ వ్యాపారవేత్తలకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. థాయ్లాండ్లో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అందుబాటులోకి తీసుకురాగలిగారని, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ అనేక అవకాశాలున్నాయన్నారు.
మాకు ఇండియా చాలా ముఖ్యం
తెలంగాణలో ఫర్నిచర్ పార్క్ను ఏర్పాటు చేయడానికి ఎంఓయూ కుదుర్చుకుంటామని జురిన్ అన్నారు. కాన్సులేట్ జనరల్ నిటిరూజ్ మాట్లాడుతూ.. ఇండియా లుక్ ఈస్ట్ పాలసీతో ముందుకెళుతోందని, థాయ్లాండ్ లుక్ వెస్ట్ పాలసీని తీసుకొచ్చిందన్నారు. దక్షిణాసియాలో థాయ్లాండ్ ఇండియాకు వ్యూహాత్మక భాగస్వామని, ప్రస్తుతం ఇరుదేశాల ట్రేడ్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. ఇరు దేశాలు ఫ్రీ ట్రేడ్ ఎగ్రిమెంట్(ఎఫ్టీఏ)లను కుదుర్చుకున్నాయన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు టింబర్ను దిగుమతి చేసుకొని ఇక్కడే ప్రొసెసింగ్ చేస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామర్స్ ప్రెసిడెంట్ కరునెండా చెప్పారు.