
పాత కాలంలో రైలు అనంగనే గుర్తొచ్చేది బొగ్గు బండి. బొగ్గును మండించి ఆవిరితో నడిపేటోళ్లు. అందుకే దానికి స్టీమ్ ఇంజన్ అన్న పేరూ ఉంది. కాలం మారిపాయె.. టెక్నాలజీ పెరిగిపాయె.. స్టీమ్ బండ్లు మరుగున పడె. ఇప్పుడంతా డీజిల్ బండ్లు, కరెంట్ బండ్లు నడుస్తున్న కాలం. ఫలితంగా కాలుష్యం పెరిగి భూమి వేడెక్కుతోంది. ఆ ట్రెండ్లో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్న బ్రిటన్.. మళ్లీ పాతకాలానికి వెళ్లిపోయింది. స్టీమ్ రైలును తీసుకొచ్చింది. విజయవంతంగా దానిని పరీక్షించింది. అప్పుడు, ఇప్పుడూ ఒక్కటే తేడా. అప్పట్లో ఆ రైలు బొగ్గుతో నడిస్తే.. ఇప్పట్లో ఈ రైలు హైడ్రోజన్తో నడుస్తుందన్నమాట. అందుకే ఆ రైలుకు ‘హైడ్రోఫ్లెక్స్’ అని పేరు పెట్టారు. లండన్లోని పోర్టర్బ్రూక్ అనే సంస్థ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హాం సాయంతో ఈ హైడ్రోఫ్లెక్స్కు రూపునిచ్చింది.
గురువారం దీని ప్రొటోటైప్ను వార్విక్షైర్లోని లాంగ్ మార్స్టన్ ట్రాక్పై రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఆ టెస్టులో వందకు వంద మార్కులు కొట్టేసింది హైడ్రోఫ్లెక్స్. ఇది పొగకు బదులు నీటి ఆవిరిని పైకి వెదజల్లుతుంది. కాబట్టి, కాలుష్యం అన్న మాటే ఉండదు. తొలి టెస్టులో భాగంగా రైల్లోని అన్ని సిస్టమ్లను చెక్ చేశారు. అందులో వాడిన ప్రతి ఒక్క భాగాన్ని విడివిడిగా పరీక్షించి పరిశీలించారు. ప్రస్తుతం బ్రిటన్ వద్ద ఉన్న క్లాస్ 319 రైళ్లలో కొత్త టెక్నాలజీని వాడి ప్రొటో టైప్ను తయారు చేశారు. ఆ ఒక్క రైళ్లకు మాత్రమే కాకుండా పాత, కొత్త అన్న తేడా లేకుండా ఏ రైళ్లకైనా ఆ టెక్నాలజీని వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కొత్త రైళ్లలో ఈ టెక్నాలజీ వాడాలనుకుంటే పాత రైళ్లను రీసైకిల్ చేసి కూడా ఈ టెక్నాలజీ పెట్టి కొత్త రైలుగా మార్చొచ్చని వివరిస్తున్నారు. రైలు టాప్లో హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ ఉంటాయి. వాటితో పాటు ఎక్కువ ఒత్తిడి ఉండే నాలుగు హైడ్రోజన్ ఫ్యూయెల్ ట్యాంకులుంటాయి. ఒక్కో ట్యాంకులో 20 కిలోల వరకు హైడ్రోజన్ పడుతుంది. వాతావరణంలోని ఆక్సిజన్ను హైడ్రోజన్తో ఫ్యూయెల్ సెల్స్ అనుసంధానించడం ద్వారా కరెంట్ పుడుతుంది. దీంతో రైలు ముందుకు కదులుతుంది. నీటి ఆవిరి బయటకు వస్తుంది. సో కాలుష్యం ఉండదు. ఒక్కో ట్యాంకు ఇంధనంతో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చట.
ఇంకో కంపెనీ కూడా
బ్రిటన్లో పర్యావరణ హిత రైలు ఇంజన్లను పోర్టర్బ్రూక్ ఒక్కటే కాదు, మరికొన్ని కంపెనీలూ తయారు చేస్తున్నాయి. ఫ్రాన్స్కు చెందిన ఆల్స్టమ్ అనే కంపెనీ దాదాపు 100 పర్యావరణ హిత ఇంజన్లను తయారు చేస్తోంది. ఇది నడిచేటప్పుడు కనీసం శబ్దం కూడా వినిపించదట. అందుకే దీనికి ‘బ్రీజ్’ అని పేరుపెట్టినట్టు సమాచారం. ఆ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని చెబుతున్నారు. జర్మనీలో ఇలాంటి రైళ్లపైనే పనిచేసిన ఎవర్షోల్ట్ రైల్ అనే సంస్థతో కలిసి ఆల్స్టమ్ పనిచేస్తోంది. బ్రిటన్లోని కొన్ని ప్రాంతాల్లో 2021కల్లా ఈ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయని ఆల్స్టమ్ ప్రకటించింది.