
సంస్థ కష్టాలకు కారణమై పదవులు పోగొట్టుకున్న కొంతమంది అత్యున్నత స్థాయి అధికారులకు ఇచ్చిన బోనస్ లను, ఇతర ప్రయోజనాలను వాపసు తీసుకోవాలని ఐఎల్ఎఫ్ఎస్ నిర్ణయించింది. ఇలాంటి అధికారులను తొలగించిన కేంద్రం ఐఎల్ఎఫ్ఎస్ ను గట్టెక్కించడానికి ఉదయ్ కోటక్ నేతృత్వం లో కొత్త బోర్డును నియమించడం తెలిసిందే. పలువురు ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడటం వల్లే కంపెనీ అప్పులు రూ.91 వేల కోట్లకు చేరాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టి గేషన్ ఆఫీస్ (ఎస్ ఎఫ్ఐఓ)తేల్చింది. అక్రమాలకు పాల్పడ్డట్టు తేలడంతో ఐఎల్ఎఫ్ఎస్ చైర్మన్ రవి పార్థసారథి, మాజీ వైస్ చైర్మన్ హరి శంకరన్ , ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధిపతి రమేశ్ బవాను ఎస్ ఎఫ్ఐఓ ఇది వరకే అరెస్టు చేసింది. మరికొందరు అధికారులపైనా దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమాలలో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు పాత్ర ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అక్రమాలను ఎత్తిచూపడంలో విఫలమైన ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ ఉద్యోగులనూ ఎస్ ఎఫ్ఐఓ ప్రశ్నించింది. ఐఎల్ఎఫ్ఎస్ లో 250 వరకుకంపెనీలు ఉండగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ ,పవర్ , ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు.