IND vs ENG: ఇంగ్లాండ్‌ చిత్తు.. సెమీస్ చేరిన భారత్

IND vs ENG: ఇంగ్లాండ్‌ చిత్తు.. సెమీస్ చేరిన భారత్

వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్లు విఫలమైనప్పటికీ.. బౌలర్లు విజృంభించడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.

230 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు బుమ్రా, షమీ పేస్‌కు ఇంగ్లిష్ బ్యాటర్లు కుదేలయ్యారు. 27 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్ ఆ జట్టులో టాప్ స్కోరర్. డేవిడ్ మలన్ (12), జానీ బెయిర్ స్టో (8), జో రూట్ (0), బెన్ స్టోక్స్‌(0), జోస్ బట్లర్‌(4), మోయిన్‌ అలీ(1) మరోసారి విఫలమయ్యారు.  భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. 

అంతకుముందు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(87), సూర్యకుమార్‌ యాదవ్‌ (49) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు తీసుకోగా.. క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ గెలుపుతో టీమిండియా తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ అధికారికంగా సెమీస్‌ రేసు నుంచి తప్పుకుంది.