కర్తార్​పూర్ ​కథేంది

కర్తార్​పూర్ ​కథేంది

సిక్కు మత స్థాపకుడు గురునానక్​ దేవ్ 550వ జయంతిని నవంబర్​ 29న నిర్వహిస్తారు. దేశంలోని అనేక గురుద్వారాల్లో వేడుకలకు సిక్కులు రెడీ అవుతున్నారు. మన దేశంలోనే కాకుండా పాకిస్థాన్​లోని కర్తార్​పూర్​లో​ ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి  కూడా భక్తులు భారీ సంఖ్యలో వెళ్తారు. ఈ యాత్ర సాఫీగా సాగటానికి రెండు దేశాలూ వివిధ సదుపాయాలను కల్పించాల్సి ఉంది. వాటి గురించి చర్చించటానికి ఇండియా, పాకిస్థాన్​ ఆఫీసర్లు ఈమధ్య సమావేశమయ్యారు.

పది మంది సిక్కు మత గురువుల్లో మొదటివారైన గురునానక్​ దేవ్​ 1469 నవంబర్​ 29న పంజాబ్​లోని నాన్​కానా సాహిబ్​లో పుట్టారు (ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్​లో ఉంది). చిన్నతనంలోనే ఆధ్యాత్మిక భావాల వైపు ఆకర్షితులై ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ దైవసందేశాలను ప్రజలకు బోధించేవారు. దాదాపు 70 ఏళ్లు బతికిన గురునానక్​.. జీవితంలోని చివరి దశలో 1539 సెప్టెంబర్​ 22న నరోవాల్ జిల్లాలోని కర్తార్​పూర్​ ఏరియాలో చనిపోయారు.

రావి నది ఒడ్డున ఉన్న కర్తార్​పూర్​లో గురునానక్​ దేవ్ నిర్మించిన గురుద్వారా సిక్కులకు పవిత్ర ప్రదేశం. దేశ విభజన వల్ల పాకిస్థాన్‌‌ పరిధిలోకి వెళ్లిపోయిన ఆ సాహిబ్​ మన దేశంలో పంజాబ్​ రాష్ట్రం గురుదాస్‌‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇండియా, పాకిస్థాన్​ ఇంటర్నేషనల్​ బోర్డర్​ నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఈ మందిరానికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో కారిడార్​ నిర్మాణానికి గత ఏడాది నవంబర్​ 26న వైస్​ ప్రెసిడెంట్​ వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. రెండు రోజుల తర్వాత పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ శ్రీకారం చుట్టారు. ఈ కారిడార్​ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని గురుద్వారా వర్గాలు చెబుతున్నాయి.

1947లో ఇండియావాళ్లకు నో పర్మిషన్​

వివిధ దేశాల భక్తులు గురుద్వారాకు బస్సుల్లో వెళ్లేటప్పుడు పాకిస్థాన్​ రేంజర్లు ఆర్మీ కాన్వాయ్​తో ఫుల్​ సెక్యూరిటీ కల్పిస్తారు. దేశ విభజన వల్ల 1947లో మనవాళ్లు ఈ ప్రదేశానికి రాకుండా పాకిస్థాన్​ ప్రభుత్వం రోడ్డు క్లోజ్​ చేసింది. దీంతో బోర్డర్​ వద్దకు వెళ్లి టెలిస్కోప్​తో చూడాల్సి వచ్చేది. రిపేర్లు, రినోవేషన్​ తర్వాత గురుద్వారాను 1999లో రీఓపెన్​ చేశారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయి నాయకత్వంలో లాహోర్​కి బస్సు యాత్ర జరిగింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య రోడ్డు, రైలు సదుపాయాలు వచ్చాయి.

వీసాతో పాక్​లోకి ఎంటరైనవాళ్లు కర్తార్​పూర్​ గురుద్వారా సాహిబ్​ సందర్శనకు వెళ్లటానికి ఎలాంటి ఆటంకాలూ ఉండేవి కాదు. కర్తార్​పూర్​ బోర్డర్​ క్రాసింగ్​ని ఓపెన్​ చేయాలనే అంశం తొలిసారి 1998లో రెండు దేశాల మధ్య చర్చకు వచ్చింది. 1999లో బస్సు దౌత్యం అనంతరం జరిగిన సంప్రదింపుల తర్వాత కర్తార్​పూర్​ సాహిబ్​ గురుద్వారాకు పాకిస్థాన్​ మార్పులు​ చేసింది. ఇండియా బోర్డర్​ వద్ద నుంచి చూడటానికి కూడా అనుమతించింది.

కారిడార్​ సంగతేంటి?

ఇండియా, పాకిస్థాన్​ మధ్య రావి నది పారుతోంది. దీన్ని దాటి వెళ్లాలంటే బ్రిడ్జ్​ కట్టాలి. ఈ కారిడార్​ను ఇండియా.. పంజాబ్​ రాష్ట్రం గురుదాస్​పూర్​ జిల్లాలోని డేరా బాబా నానక్​ నుంచి నిర్మించాల్సి ఉందని రాజ్​నాథ్​సింగ్​ కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. గురునానక్​​ 550వ జయంతి కార్యక్రమాలను తాను ఎప్పటికప్పుడు రివ్యూ​ చేస్తుంటానని కూడా తెలిపారు. ఆయన తర్వాత అమిత్​షా హోం మినిస్టర్​ అయ్యాక ఈ యాత్రకు సంబంధించిన అంశాలపై తాజాగా ఆదివారం పాకిస్థాన్​లోని వాఘా ప్రాంతంలో రెండు దేశాల ఆఫీసర్లు భేటీ అయ్యారు. బ్రిడ్జికి బదులు మట్టిరోడ్డుతో కాజ్​వే కట్టాలని పాకిస్థాన్​ అనుకుంటోంది. ఆ ప్రపోజల్​ను ఇండియా వ్యతిరేకిస్తోంది. కాజ్​వే వల్ల కర్తార్​పూర్​ సాహిబ్​ గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ మాదిరిగానే బ్రిడ్జ్​ నిర్మించాలని పాక్​ను కోరింది. అయితే ఈ విషయాన్ని పక్క దేశం పెండింగ్​లో పెట్టింది. దీంతో కారిడార్​ను నవంబర్​లో అందుబాటులోకి తెచ్చేందుకు వేరే ఏర్పాట్లు చేయాలని ఇండియా భావిస్తోంది. వాస్తవానికి ఈ​ కారిడార్​ డిమాండ్ ఇప్పటిది కాదు. 20 ఏళ్ల నాటిది. 1999లో లాహోర్​ డిక్లరేషన్​లో కూడా ఈ అంశాన్నీ చేర్చారు. తర్వాత వివిధ సందర్భాల్లో ఈ విషయాన్ని ఇండియా పాకిస్థాన్​కి గుర్తు చేస్తూనే ఉంది. 2004లో ప్రధాని మన్మోహన్​సింగ్​ కూడా అమృత్​సిర్​ స్పీచ్​లో ఈ టాపిక్​ని ప్రస్తావించారు. మతపరమైన మందిరాలకు సంబంధించిన 1974 ప్రొటోకాల్​లోనూ కర్తార్​పూర్​ కారిడార్​ను చేర్చాలని మన దేశం డిమాండ్​ చేస్తోంది.

ఆ గురుద్వారా ప్రత్యేకత ఏంటంటే…

ఇండియా, పాకిస్థాన్​ను కలిపే కర్తార్​పూర్ కారిడార్​ నిర్మాణం గురునానక్​ దేవ్​ 550వ జయంతికి నెల ముందే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ బోర్డర్​ క్రాసింగ్​ లింకేజ్​ రోడ్డు అందుబాటులోకి వస్తే మన దేశం నుంచి భక్తులు గురుద్వారా దర్బార్​ సాహిబ్​కి నేరుగా చేరుకోవచ్చు. గురునానక్​ దేవ్​ మరణించటానికి ముందు సుమారు 18 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలోనే ఉన్నారని, సిక్కు మతస్తులను కూడా తొలిసారి ఇక్కడే సమావేశపరిచారని చెబుతుంటారు. తమ మత గురువు శాశ్వత విశ్రాంతి తీసుకున్న ఈ గురుద్వారా అంటే సిక్కులకు ఎంతో భక్తి. ఈ కర్తార్​పూర్​ సాహిబ్​ ఓసారి వరదల వల్ల డ్యామేజ్​ అయింది. దీంతో నాటి పాటియాలా మహారాజు, పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​సింగ్​ తాత భూపిందర్​ సింగ్​ పునర్నిర్మించారు. పాకిస్థాన్​ ప్రెసిడెంట్ జనరల్​ పర్వేజ్​ ముషారఫ్​ హయాంలో రినోవేట్​ చేశారు. ఈ పుణ్యక్షేత్రాన్ని ఇండియా బోర్డర్​ నుంచి డైరెక్ట్​గా చూడొచ్చు. గురుద్వారా కనిపించకుండా చుట్టుపక్కల అడ్డంగా ఉండే పొడవైన చెట్లను పాకిస్థాన్​వాళ్లు ఎప్పటికప్పుడు కొట్టేస్తుంటారు.

మన దేశం నుంచి 4 సార్లు

ఇండియా నుంచి సిక్కులు కర్తార్​పూర్​ గురుద్వారా సందర్శనకు ఏటా ముఖ్యంగా నాలుగు సార్లు వెళుతుంటారు. ఒకటి.. బైశాఖి పండగ సందర్భంగా. రెండు.. సిక్కుల ఐదో గురువు అర్జున్​ దేవ్​ అమరుడైన రోజు. మూడు.. మహా రాజా రంజిత్​ సింగ్​ వర్ధంతి నాడు. నాలుగు.. గురునానక్​ దేవ్​ జయంతి రోజు. ఈ నాలుగు సందర్భాల్లో మన దేశ భక్తులు పాకిస్థాన్​లోని అన్ని గురుద్వారాలకూ వెళ్లేందుకు డైరెక్ట్​ యాక్సెస్​ ఉంటుంది. కర్తార్​పూర్​ కారిడార్​ నిర్మాణం పూర్తైతే మనోళ్లకు పాస్​పోర్టులు, వీసాలు లేకుండానే యాత్రలో పాల్గొనేందుకు వీలుంటుంది.