లఖీంపూర్ ఖేరీ: ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో రైతు నిరసనల సందర్భంగా ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో మరణించిన నలురుగు రైతుల్లో ఒక వ్యక్తి 19 ఏండ్ల యువకుడైన లవ్ప్రీత్ సింగ్. అతడు మరణించే ముందు తన తండ్రిని చూడడం కోసం పడిన తపన గురించి వింటే మనసు చలించిపోతుంది. గాయాలతో చికిత్స పొందుతూ తనతో మాట్లాడిన విషయాలను అతడి తండ్రి సత్నమ్ సింగ్ చెబుతూ కంటతడి పెట్టుకున్నాడు. తనను తర్వగా చూడాలని ఉందన్నాడని, కానీ ఆస్పత్రికి వెళ్లేలోపు చనిపోయాడని విలపించాడు.
మూడు రోజులకు గానీ అంత్యక్రియలు చేయనీయలే
ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పర్యటన సందర్భంగా లఖీంపూర్ ఖేరీలో రైతులు నిరసనలు చేస్తుండగా కాన్వాయ్లోని కారు వాళ్లపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన నిరసనకారులు ఆ కాన్వాయ్పై తిరగబడి.. రెండు వాహనాలను తగలబెట్టడంతో పాటు ఆ కాన్వాయ్లో ఉన్న వ్యక్తులపై దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది మరణించారు. అందులో ఒకడైన లవ్ప్రీత్ సింగ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అయితే అతడు మరణించే కొన్ని నిమిషాల ముందు తన తండ్రిని చూడాలని ఎంతగానో తప్పించిపోయాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు లవ్ప్రీత్ను ఆస్పత్రిలో చేర్చినప్పుడు తనకు ఫోన్ చేశాడని తండ్రి సత్నమ్ సింగ్ చెబుతున్నాడు. ఆ సమయంలో ఎలా ఉన్నావు బేటా అని అడిగితే, తాను క్షేమంగానే ఉన్నానని చెప్పాడని అన్నాడు. అయితే ‘‘నాన్నా త్వరగా వచ్చెయ్ నిన్ను చూడాలని ఉంది” అన్నాడని, దారిలోనే ఉన్నామని చెప్పి తాను సముదాయించానని సత్నమ్ తెలిపాడు. అయితే కొన్ని నిమిషాల్లోనే తాము ఆస్పత్రికి చేరుకున్నామని, కానీ అప్పటికే లవ్ప్రీత్ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు లవ్ప్రీత్ మరణించిన మూడు రోజులకు గానీ అంత్యక్రియలు చేయనీయలేదని అధికారులను తప్పుబట్టాడు.