
- టిక్టాక్, ఇతర ట్రేడ్ అంశాలపై డీల్ కుదురుతుందని వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న టైమ్లో, ఈ దేశాల అధ్యక్షులు తాజాగా ఫోన్లో మాట్లాడారు. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ సంభాషణలో టిక్టాక్పై చర్చించారు. ఈ ఏడాది జూన్ తర్వాత వీరు ఫోన్లో మాట్లాడడం ఇదే మొదటిసారి. షార్ట్వీడియో యాప్ టిక్టాక్ యూఎస్లో కొనసాగాలంటే, పేరెంట్ కంపెనీ బైట్డ్యాన్స్ తన అమెరికన్ బిజినెస్ను లోకల్ కంపెనీలకు అమ్మాలి లేదా యూఎస్లో డేటా నిల్వ, నియంత్రణ నిబంధనలకు లోబడి పనిచేయాలి. టిక్టాక్ను 2025 జనవరి నాటికి మూసివేయాలనే చట్టాన్ని 2024లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.
ట్రంప్ ఈ గడువును డిసెంబర్ మధ్య వరకు పొడిగించారు. డీల్ కుదుర్చుకోవడంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. “టిక్టాక్కు గొప్ప విలువ ఉంది. అది యూఎస్ చేతిలో ఉంది” అని ట్రంప్ అన్నారు. ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కో–ఆపరేషన్ (ఏపీఈసీ) సమావేశానికి ముందు వ్యూహాత్మక చర్చలు ఈ ఫోన్ కాల్ ద్వారా జరిగాయి.
ఈ ఏడాది అక్టోబర్ 30–నవంబర్ 1 మధ్య దక్షిణ కొరియాలో జరిగే ఏపీఈసీ సమ్మిట్ జరగనుంది. ట్రంప్, షీ జిన్పింగ్ ఈ సమ్మిట్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్ను చైనా అధికారులు ధృవీకరించలేదు. ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత చైనా దిగుమతులపై భారీగా టారిఫ్లు విధించారు. ఇది హిస్టరిలోనే అత్యధిక స్థాయికి చేరింది. ఆగస్టులో టారిఫ్లకు తాత్కాలిక విరామం ఇచ్చినా, ఇరు దేశాల మధ్య వాణిజ్య సమస్యలు పరిష్కారం కాలేదు.
మోదీ– ట్రంప్ మీటింగ్?
మలేషియాలో ఈ ఏడాది అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరిగే ఏషియన్ సమ్మిట్లో ట్రంప్, భారత ప్రధాని మోదీ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 16న మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఫోన్ సంభాషణలో, ఇరువురు ఈ అంశంపై చర్చించారని తెలిసింది. ట్రంప్ హాజరయ్యే విషయాన్ని మలేసియా ప్రధాని ధృవీకరించగా, మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన రాలేదు.