- మొత్తం 22 వేల కోట్ల షేర్ల అమ్మకం
- ఫలితంగా ప్రభుత్వానికి రూ.21 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీఓ వివరాలను ఎల్ఐసీ బుధవారం అధికారంగా ప్రకటించింది. ఈ పబ్లిక్ ఆఫర్ మే 4న మొదలై మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఇష్యూ ప్రైస్ను రూ. 902–-949 మధ్య నిర్ణయించారు. ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు రిటైల్ పెట్టుబడిదారులకు, పాలసీదారులకు రాయితీలను ప్రకటించారు. ఆఫర్ద్వారా రూ.21 వేల కోట్ల విలువైన 22 వేల కోట్ల షేర్లను అమ్ముతుంది కాబట్టి మనదేశంలో ఇప్పటి వరకు వచ్చిన ఐపీఓల్లో ఇదే అతిపెద్దది అవుతుంది.
ఎల్ఐసీ ఐపీఓ తేదీలు:
ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీఓ కోసం మే 4 నుండి మే 9 వరకు బిడ్డింగ్ వేయవచ్చు. మే 4న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ ఓపెన్ అవుతుంది. ఇదే నెల 16న షేర్లు క్రెడిట్అవుతాయి. మరునాడు షేర్లను లిస్ట్ చేస్తారు. ఈ మేరకు మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఎల్ఐసీ వర్గాలు తెలిపాయి.
ఇష్యూ సైజు:
ఎల్ఐసీలోని తన వాటాలో ప్రభుత్వం 3.5 శాతం అమ్ముతోంది. అంటే ఆఫర్ సమయంలో దాదాపు 22 వేల కోట్ల ఎల్ఐసి షేర్లు అమ్మకానికి వస్తాయి. ఐదు శాతం వాటాను అమ్ముదామని ఇంతకుముందు అనుకున్నారు కానీ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండటంతో సైజును 3.5 శాతానికి తగ్గించారు. .
ఎల్ఐసీ ఐపీఓ ధర:
పది రూపాయల ఫేస్వాల్యూ కలిగిన కంపెనీ ఈక్విటీ షేరు ధరను రూ. 902 నుండి రూ. 949 మధ్య నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.45 తగ్గింపు ఉంటుంది. పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ పబ్లిక్ ఆఫర్ మార్కెట్ లాట్ సైజును15 షేర్లుగా నిర్ణయించారు. రిటైల్- ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ గరిష్టంగా 14 లాట్లు లేదా 210 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎల్ఐసీ ఐపీఓ కోటా:
రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్హెచ్పీ) ప్రకారం 22,137,492 ఈక్విటీ షేర్లను (ఇష్యూలో 10 శాతం) ఎల్ఐసీ పాలసీదారుల కోసం కేటాయించారు. 15, 81,249 వరకు ఈక్విటీ షేర్లను( 0.70 శాతం) ఉద్యోగుల కోసం రిజర్వ్ చేశారు. సగం షేర్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (క్యూఐబీలు) ఇస్తారు. క్యూఐబీ భాగం నుండి 60 శాతం షేర్లను యాంకర్ పెట్టుబడిదారులకు ఇస్తారు. యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్లో మూడింట ఒక వంతు షేర్లను దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కోసం కేటాయిస్తారు. దాదాపు 15 శాతం షేర్లను నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ) ఇస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయిస్తారు.
పాలసీహోల్డర్లకు పాన్ తప్పనిసరి
2022 ఫిబ్రవరి 28 నాటికి బీమా పాలసీకి పాన్కార్డు లింక్ అయిన ఎల్ఐసీ పాలసీదారులు ఈ మెగా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎల్ఐసీ పాలసీదారులు గరిష్టంగా రూ. రెండు లక్షల విలువైన షేర్లకు బిడ్ వేయొచ్చు. పాలసీదారులకు రూ.60 చొప్పున తగ్గింపు ఉంటుంది. ఈ కోటా ఓవర్సబ్స్క్రయిబ్ అయినట్లయితే, దామాషా ప్రాతిపదికన కేటాయింపు ఉంటుంది.
ఐపీఓ వాల్యుయేషన్
ఎల్ఐసీ ఐపీఓ వాల్యుయేషన్పై -ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్, ఏంజెల్ వన్ లిమిటెడ్ కు చెందిన యష్ గుప్తా మాట్లాడుతూ, “ఎల్ఐసీ వాల్యుయేషన్రూ.ఆరు లక్షల కోట్లు కాగా, ఐపీఓ సైజు రూ. 21 వేలు కోట్లు. ఇంతకుముందు వాల్యుయేషన్ దాదాపు రూ. 13 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. ఎంబెడెడ్ వాల్యుయేషన్ దాదాపు రూ. 5.40 లక్షల కోట్లు. ఎల్ఐసి ఐపిఓ దాని ఎంబెడెడ్ వాల్యూలో దాదాపు 1.1 రెట్లు వాల్యుయేషన్ ఉంది. ప్రైవేట్ కంపెనీలు ఎంబెడెడ్ విలువకు దాదాపు 2-3 రెట్లు ఎక్కువ వాల్యుయేషన్తో వ్యాపారం చేస్తున్నారు. రూ.ఆరు లక్షల కోట్ల వాల్యుయేషన్ లాభదాయకంగా కనిపిస్తోంది”అని వివరించారు.