ఫోన్​ చేస్తే ఎందుకు ఎత్తరు?.. మీకు సామ్రాజ్యాలేమైనా ఉన్నాయా?

ఫోన్​ చేస్తే ఎందుకు ఎత్తరు?.. మీకు సామ్రాజ్యాలేమైనా ఉన్నాయా?
  • జడ్పీ మీటింగ్​లో బీసీ గురుకుల ఆర్సీవోపై ఎమ్మెల్యే రవీంద్ర కుమార్​ ఫైర్​
  • మీటింగ్​కు రాని ఇరిగేషన్​సీఈపైనా ఆగ్రహం 

నల్గొండ, వెలుగు : ‘మీకు రాజ్యాలు...సామ్రాజ్యాలు ఏమైనా ఉన్నాయా? ఫోన్​ఎందుకు ఎత్తరు? మీకు కావాలని సరదాగా ఫోన్​చేయం కదా?’ అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్​నల్గొండ జిల్లా బీసీ గురుకుల ఆర్సీవో షకీనాపై ఫైర్​అయ్యారు. బుధవారం నల్గొండ జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​లో గురుకుల సీట్ల భర్తీ గురించి వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా అధికారులు తమ ఫోన్​ఎత్తడం లేదని ఎమ్మెల్యేతోపాటు, మునుగోడు జడ్పీటీసీ నారోబోయిన సర్వరూప రాణి మండిపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘మీతో ఏం కాదని తెలుసు..అయినా సరే ఫోన్ ఎత్తడం అలవాటు చేసుకోండి. మా దగ్గరకు ఎంతో మంది వస్తుంటారు? వాళ్లను తృప్తి పర్చించేందుకు మీకు ఫోన్​చేస్తుంటాం.

ఆ టైంలో మీరు ఫోన్​ఎత్తకపోతే ఎట్లా? నాలుగు రోజుల కింద ఫోన్​చేసి చేసి అలిసిపోయా? ఫోన్​ఎత్తకుండా ఉండకపోవడానికి కారణం ఏందీ? మీకు రాజ్యాలు.. సామ్రాజ్యాలు ఏమైనా ఉన్నాయా?’ అని అసహనం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ స్వరూప రాణి మాట్లాడుతూ ‘మీరు ఫోన్​ఎత్తడం లేదంటే అక్కడేదో మాకు తెలియకుండా గూడుపుఠాణి జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీలను స్థానిక ప్రోగాంలకు పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు. పైగా గురుకులాల్లో డ్రాపౌట్స్​కింద మిగిలిపోయిన సీట్లను మీ ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

సీట్ల భర్తీపై కలెక్టర్​ఆర్వీ కర్ణన్​స్పందిస్తూ ఇక నుంచి డ్రాపౌట్స్​కింద మిగిలిపోయిన సీట్లను తనకు చెప్పకుండా భర్తీ చేయొద్దని, అలాగే అధికారులు ఫోన్​ఎత్తాలని వార్నింగ్​ఇచ్చారు. నీటిపారుదల శాఖ రివ్యూ జరిగే క్రమంలో ఏఈలు, డీఈలు వచ్చినా సీఈ రాలేదు. దీంతో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, జడ్పీ చైర్మన్​బండా నరేందర్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారి రాకుండా మండల, డివిజన్​ స్థాయి అధికారులను మీటింగులకు పంపిస్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. దీంతో కలెక్టర్​ కర్ణన్​జోక్యం చేసుకుని అప్పటికప్పుడు చీఫ్​ ఇంజినీర్​కు ఫోన్​చేయించారు. దీంతో ఆయన హుటాహుటిన సమావేశానికి వచ్చారు..