న్యూఢిల్లీ: సంపదకు సంబంధించి ఏ లిస్ట్లో చూసినా ముందుండేది బిలీనియర్ ముఖేష్ అంబానీనే. ఆయన సంపద కోట్లకు కోట్లు పెరగడమే కానీ, తరగడం లేదు. నిన్న కాక మొన్న రిలీజ్ అయిన ఫోర్బ్స్ లిస్ట్లో కూడా మరోసారి అంబానీనే టాప్లో నిలిచారు. గత నెలలో అయితే అంబానీ సంపద ఏకంగా రూ.40 వేల కోట్లు పెరిగి రూ.4.2 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదంతా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర దూసుకుపోవడమేనని తెలిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గతనెలలో 9.6 శాతం పెరిగాయి. దీంతో ఇండియా మోస్ట్ వాల్యుడ్ కంపెనీగా రిలయన్స్ టాప్లో నిలిచింది. అంబానీనే కాక, అంబానీ కంపెనీ కూడా టాప్లోనే నిలవడం విశేషం. మోస్ట్ వాల్యుడ్ కంపెనీగా కాంపిటీటర్ టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకదానికొకటి పోటీ పడుతూ టాప్లో నిలుస్తూ ఉంటాయి. కానీ ఈ సారి టీసీఎస్ను మించి పోయి రిలయన్స్ చాలాముందుకెళ్లింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రోజు రూ.8.57 లక్షల కోట్లకు ఎగిసింది. ఇదే రోజు టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.46 లక్షల కోట్లుగా ఉంది. ఇరు కంపెనీలకున్న గ్యాప్ రూ.1.11 లక్షల కోట్లుగా ఉంది. గత రెండు లేదా మూడు వారాల నుంచి ఈ గ్యాపే ఉంటోంది. ఎందుకంటే రిలయన్స్ షేర్లు బాగా ర్యాలీ చేస్తుండగా.. టీసీఎస్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
జియోనే కారణం…
రిలయన్స్ షేరు ధర గత నెలలో 9.6 శాతం పెరిగి రూ.1,352.40కు చేరుకుంది. టీసీఎస్ షేరు ధర 7.75 శాతం తగ్గి రూ.1,987.05కు పడిపోయింది. రిలయన్స్ షేర్లు పెరగడానికి ప్రధాన కారణం జియో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ను నమోదు చేయడమే. రిలయన్స్ జియో దాని ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పోలిస్తే మెరుగైన మార్జిన్లను రాబట్టుకుంటోంది. యాక్సిస్ క్యాపిటల్ అంచనాల ప్రకారం జియో ఆపరేటింగ్ ఇన్కమ్ రెండో క్వార్టర్లో 5.2 శాతం పెరిగే అవకాశాలున్నాయి. ఈబీఐటీడీఏ మార్జిన్ మాత్రం 40.2 శాతంగానే ఉంటుందని తెలిసింది. మరోవైపు గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు మాత్రం రిలయన్స్కు తగ్గిపోతున్నాయి.