ఉల్లి ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు

ఉల్లి ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు
  • ఎగుమతిపై నిషేధం.. నిల్వపై పరిమితి

ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో వాటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. వరదలతో ఉల్లిపాయల రవాణాకు ఇబ్బందులు పెరగడంతో ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపు కిలో 80 రూపాయలకు చేరింది. దీంతో దేశంలోని అవసరాలను తీర్చేందుకు ప్రయారిటీ ఇస్తూ విదేశాలకు ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.

ఉల్లిపాయల ఎగుమతిని తక్షణం నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఏ దేశానికీ ఉల్లి ఎగుమతి చేయడానికి లేదని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఎటువంటి ఆంక్షలు లేని ఉల్లి ఎగుమతి పాలసీని సవరించి, నిషేధం విధించామని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

వ్యాపారులకు స్టాక్ లిమిట్

ఉల్లి స్టాక్ ఎక్కడో ఒకచోట ఆగిపోకుండా కేంద్రం కఠిన నిబంధనలను అమలు చేయాలని ఇవాళ నిర్ణయించింది. వ్యాపారుల వద్ద స్టాక్ నిల్వ విషయంలో పరిమితులను విధించింది. రిటైలర్ల వద్ద 100 క్వింటాళ్లు, హోల్ సేల్ వ్యాపారుల దగ్గర 500 క్వింటాళ్లకు మించి ఉండకూడదని నిబంధన పెట్టింది. దేశమంతా ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, వీటిని ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.