- నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం
- పరిశ్రమలకు రూ.50 లక్షలు
- సేవారంగ పరిశ్రమలకు రూ.20 లక్షల బ్యాంక్ లోన్
- ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు సబ్సిడీ
మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక కొందరు, సరైన చదువు లేక మరికొందరు, స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేక సతమతమవుతున్నారు. ఇలాంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)ను అమలు చేస్తోంది. ఉన్నత విద్యావంతులైనా, ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉండి స్వశక్తితో ఉన్నత స్థితికి ఎదగాలనే తపన ఉంటే చాలు. ఆర్థిక స్థోమత లేకున్నా ఇండస్ర్టీ పెట్టాలనే ఉత్సాహం ఉన్నవాళ్లకు ఈ స్కీం ఒక వరంగా నిలుస్తోంది. స్వల్ప పెట్టుబడి, బ్యాంక్ లోన్, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని అనతికాలంలోనే వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవకాశం కల్పిస్తోంది. తాము ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా మరికొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు దారి చూపుతోంది.
సబ్సిడీలు, బ్యాంక్ లోన్లు...
పీఎంఈజీపీ కింద తయారీ రంగంలో పరిశ్రమలకు రూ.50 లక్షల వరకు, సేవారంగ పరిశ్రమలకు రూ.20 లక్షల వరకు లోన్ లభిస్తుంది. బ్యాంకులు 60 నుంచి 75 శాతం టర్మ్ లోన్ల రూపంలో అందించి 11 నుంచి 12 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తాయి. ప్రిలిమినరీ మారిటోరియం తర్వాత రీపేమెంట్కు మూడు నుంచి ఏడు సంవత్సరాల వ్యవధి ఉంటుంది. తీసుకున్న రుణంలో అభ్యర్థుల ప్రాంతాలను బట్టి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. అర్బన్, రూరల్ స్పెషల్ కేటగిరీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో సబ్సిడీలు పొందవచ్చు. అర్బన్ జనరల్ కేటగిరీలో 15 శాతం, రూరల్ 25 శాతం, అర్బన్ స్పెషల్ 25 శాతం, రూరల్ స్పెషల్ కేటగిరీలో 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
- ఇదివరకే స్థాపించి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తునన పీఎంఈజీపీ, ముద్ర, ఆర్ఈజీపీ పరిశ్రమల విస్తరణ కోసం రెండవసారి ఆర్థికసహాయం అందిస్తుంది. ఇందులో తయారీ రంగానికి రూ.కోటి వరకు, సేవా రంగానికి రూ.25లక్షల వరకు బ్యాంక్ లోన్, ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది.
- 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైనా అర్హులే. దీనికి ఆదాయ పరిమితి లేదు. రూ.5లక్షల ప్రాజెక్టు వ్యయం వరకు ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. తయారీ రంగంలో రూ.10 లక్షలు, సేవారంగంలో రూ.5లక్షలు పైబడిన వ్యయం కలిగిన ప్రాజెక్టులకు కనీస విద్యార్హత 8వ తరగతి.
- లబ్దిపొందాలనుకునే వాళ్లు జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్లో లేదా కేవీఐసీలో సంప్రదించాలి.www.kviconline.gov.in/pmegpeportal ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉమ్మడి జిల్లాలో ఎన్నో అవకాశాలు...
ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉంది. జిల్లాలో అగ్రి బేస్డ్, ఫుడ్ ప్రాసెసింగ్, కన్స్ర్టక్షన్, సింగరేణి అనుబంధ పరిశ్రమలను స్థాపించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని ఇండస్ర్టియల్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. కాటన్ జిన్నింగ్ అండ్ స్పిన్నింగ్ మిల్స్ అనుబంధ పరిశ్రమలు, మినీ రైస్మిల్స్, పౌల్ట్రీఫామ్స్, పైపుల తయారీ, సిమెంట్ ఇటుకల తయారీ ఇండస్ట్రీలు, మ్యాంగో, సోయా తదితర ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ ప్రొడక్ట్స్, వర్మీకంపోస్ట్ యూనిట్లు వ్యవసాయ అనుబంధంగా పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే సేవా రంగంలో పేపర్ పేట్ల తయారీ, హైవేలపై దాబా హోటళ్లు, బ్యూటీపార్లర్లు, బొటిక్స్,గార్మెంట్స్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.
యువత సద్వినియోగం చేసుకోవాలి...
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు పీఎంఈజీపీని సద్వినియోగం చేసుకోవాలని డిస్ర్టిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ హరినాథ్ సూచించారు. నస్పూర్ కాలనీలోని సింగరేణి గార్డెన్స్లో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, సింగరేణి అనుబంధ పరిశ్రమల స్థాపనకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పీఎంఈజీపీ ఉద్దేశాలు, బ్యాంక్ లోన్లు, సబ్సిడీల గురించి వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 500 మంది ఔత్సాహిక యువత హాజరయ్యారు. ఇండస్ట్రీస్ ఏడీ రఘు, డీఆర్డీవో శేషాద్రి, లీడ్బ్యాంక్ మేనేజర్ మహిపాల్రెడ్డి, కేవీఐసీ, కేవీఐబీ అధికారులు రాజేశ్కుమార్, అనసూయ పాల్గొన్నారు.
- పరిశ్రమల కేంద్రం జీఎం హరినాథ్