మన క్రికెటర్లకు ఓర్పు ఎక్కువ

మన క్రికెటర్లకు ఓర్పు ఎక్కువ
  • విదేశీ ఆటగాళ్లకు..మనవాళ్లకు తేడా ఇదే -గంగూలీ

కోల్‌కతా: మెంటల్ హెల్త్ ఇష్యూస్ డీల్ చెయ్యడంలో ఫారిన్ క్రికెటర్లతో పోలిస్తే ఇండియన్ ప్లేయర్లకు ఓర్పు ఎక్కువని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఏడెనిమిది నెలలుగా బయో బబుల్లో ఉంటూ ఇండియన్ క్రికెటర్లు బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తుండటమే ఇందుకు నిదర్శనమని దాదా చెప్పాడు. ‘ఫారిన్ క్రికెటర్లతో పోలిస్తే ఇండియన్ ప్లేయర్లకు ఓర్పు ఎక్కువ. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ప్లేయర్లతో నేను కూడా ఆడా. మెంటల్గా ఏదైనా సమస్య వస్తే వాళ్లు వెనకడుగు వేసేస్తారు. ఆరేడు నెలలుగా బయో బబుల్లో ఉంటూ మనోళ్లూ తీరిక లేని క్రికెట్ ఆడారు. బబుల్స్లో ఉండటం అంత ఈజీ కాదు. హోటల్ రూమ్ నుంచి గ్రౌండ్ కు వెళ్లి ఒత్తిడిని హ్యాండిల్ చేసి తిరిగి రూమ్ చేరుకుంటున్నారు. మళ్లీ గ్రౌండ్లోకి వస్తున్నారు. ఇది నిజంగా ఓ కొత్త జీవితమనే చెప్పాలి. మనోళ్లు ఇలా ఆడుతుంటే.. బబుల్స్ లలో ఉండలేక ఆస్ట్రేలియా టీమ్ సౌతాఫ్రికా టూర్ నే వాయిదా వేసుకుంది. ఇండియా సిరీస్ పూర్తయిన వెంటనే ఆసీస్ జట్టు సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉన్నా.. వారి ప్లేయర్లు  అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. మనకు.. వేరే వాళ్లకు ఉన్న తేడా ఇదే. కరోనా అనేది ఇప్పట్లో పోయేది కాదు. అందువల్ల ప్లేయర్లంతా ఈ పరిస్థితికి మానసికంగా సిద్ధమై ఉండాలి. పాజిటివ్ గా ఉంటూ మన పని మనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది’ అని ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ చెప్పుకొచ్చాడు.