ఏకగ్రీవం అపహాస్యం! : మంగారి రాజేందర్

ఏకగ్రీవం అపహాస్యం! : మంగారి రాజేందర్

సూరత్​లోని లోక్​సభ స్థానానికి ఒక్క ఓటు కూడా వేయకముందే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లక్షలాది మంది ఓటర్లు నిరాశకు గురై ఉంటారు. ఈవీఎం బటన్​నొక్కి తాము ఈ దేశ ప్రజాస్వామ్యంలో పాల్గొన్నామన్న ఆనందం వాళ్లకి లేకుండా పోయి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎం బీప్​ శబ్దాన్ని వినలేకపోయామని కొందరు, ఆ ఎన్నికల సందడిని చూడలేకపోయామని మరి కొందరు బాధపడి ఉంటారు.

ఓటువేసిన తరువాత సిరావేళ్లతో తమ ఛాయాచిత్రాలను సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయలేదని కూడా కొంతమంది చింతిస్తూ ఉండవచ్చు. సూరత్​ ఎన్నికల్లో కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురైనాయి. మరికొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. (కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురికావడంలో ఎలాంటి ప్రలోభాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు). 

ప్రధానపార్టీ అయిన కాంగ్రెస్​ ప్రైమరీ, స్టాండ్​బై అభ్యర్థుల నామినేషన్​ పత్రాలు తిరస్కరణకు గురవగా మిగిలిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ప్రలోభాల గురించి విచారణ జరపాల్సిన అవసరం ఎలక్షన్​ కమిషన్​ మీద ఉంది. ఈ ఎన్నిక కనీసం సరైన నామినేషన్​ వేసిన అభ్యర్థికి ‘నోటా’కి మధ్య కూడా జరగలేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు, ఎలక్షన్​కమిషన్​ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

సూరత్​లో ఏం జరిగింది..

ఎలాంటి పోటీ లేకుండా అభ్యర్థులను ఎన్నుకోవడమనేది దేశంలోని స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలకు, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి ముప్పు అని అనుకోవచ్చు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇది  ప్రజాస్వామ్యం అన్న  పదానికి విఘాతంగా పరిణమిస్తుంది. సూరత్​లో బీజేపీ, కాంగ్రెస్​, బీఎస్పీ ఇంకా కొందరు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్​ అభ్యర్థిని ప్రతిపాదించిన వారు నామినేషన్​ పత్రాల మీద తమ సంతకాలని తిరస్కరించారు. అవి తమవి కాదని ఎలక్షన్​అధికారి ముందు ప్రమాణ పత్రాలను దాఖలు చేశారు.

కాంగ్రెస్​ అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరోకాదు ఆ అభ్యర్థి సొంత బావ, మేనల్లుడు, వ్యాపార భాగస్వామి. స్టాండ్​బై అభ్యర్థి ప్రతిపాదకులు కూడా తమ సంతకాలను  ఫోర్జరీ  చేశారని రిటర్నింగ్​ అధికారికి తెలియజేశారు.  ఈ మేరకు  ప్రతిపాదకులు  ప్రమాణపత్రాలను దాఖలు చేశారు. ఫలితంగా కాంగ్రెస్​ అభ్యర్థి నామినేషన్ను, అదేవిధంగా డమ్మీ అభ్యర్థి నామినేషన్ను ఎలక్షన్​ అధికారి తిరస్కరించారు. మిగిలిన 8మంది అభ్యర్థులు తమ నామినేషన్​ పత్రాలని ఉపసంహరించుకున్నారు.  ఇక మిగిలింది బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్. అతడిని విజేతగా జిల్లా కలెక్టర్,  ఎన్నికల అధికారి ఎలాంటి జాప్యం లేకుండా ఈ నెల 22న ప్రకటించారు. అయితే, అభ్యర్థుల ఉపసంహరణకి, తిరస్కరణకి గల కారణాలు నమ్మదగినవిగా అనిపించడం లేదు.   

ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం

ఎన్నికల్లో పోటీని తొలగించడానికి జరిగిన ప్రక్రియలు ఆందోళనను కలిగిస్తాయి. ఎందుకంటే అవి ప్రతిపక్షం, మరీ ముఖ్యంగా కాంగ్రెస్​ లేని రాజకీయాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ పోటీల తొలగింపు ప్రక్రియ మిగతా నియోజకవర్గాలకు వ్యాపిస్తే  ప్రజస్వామ్యం మనుగడ సాగించదు.  ఎన్నికల్లో  పోటీని తొలగించడం అనేది  ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే.  ఈ రోజు సూరత్​ ప్రజలు తమ ఓటు హక్కుని కోల్పోయారు.  రేపు  దేశ ప్రజలు  తమ ఓటు హక్కుని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.  ఓటర్లు ఒత్తిడికి గురికాకుండా, ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం  ఎన్నికల కమిషన్​ బాధ్యత.  

అనుమానాస్పద  పరిస్థితుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకుండా చూసుకోవడం కూడా ఎన్నికల కమిషన్​ బాధ్యత.  ఈ  అసాధారణ,  అనుమానాస్పద  సంఘటనల మీద ఎన్నికల కమిషన్​ చర్యలు చేపట్టలేదా?  చండీగఢ్​లో మేయర్​ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఈ మధ్య చర్యలు తీసుకొన్నది.  ఎన్నికల విధ్వంసాన్ని రద్దు చేసింది.  సూరత్​ ఎన్నికల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆ విధంగా చర్యలు తీసుకొని ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తుందా వేచి చూడాలి. 
 
కాంగ్రెస్ ముందున్న మార్గం హైకోర్టులో​ పిటిషన్​

సూరత్​లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్​ పత్రాలను దాఖలు చేశాడు.  ప్రతిపాదకులు అతని బంధువులు,  బిజినెస్​ పార్టనర్.  అయితే, ఈ ప్రతిపాదకుల సంతకాలు నిజమైనవి కాదని బీజేపీ కార్యకర్త ఒకరు అతడి నామినేషన్​పై అభ్యంతరం వ్యక్తం చేశాడు.  అభ్యర్థి నామినేషన్​ పత్రాల మీద  ప్రతిపాదకులు సంతకాలు చేయలేదని రిటర్నింగ్​అధికారి ప్రతిపాదకుల నుంచి ప్రమాణ పత్రాలు స్వీకరించాడు.  ఈ విషయం మీద అభ్యర్థి  నుంచి ఒక రోజులో  సమాధానాన్ని రిటర్నింగ్​ అధికారి కోరాడు.  

నిర్ణీత గడువులోగా  ప్రతిపాదకులు రిటర్నింగ్​ అధికారి ముందు హాజరుకాలేదు.  అందుకని అతని మూడుసెట్ల  నామినేషన్​ పత్రాలను  ఆ అధికారి తిరస్కరించాడు.  డమ్మీ అభ్యర్థి  విషయంలో కూడా  ఇదే జరిగింది.  అతడి నామినేషన్​ కూడా తిరస్కరణకి గురైంది.  గతంలో  కూడా ఏకగ్రీవ  ఎన్నికలు దేశ స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రెండు దశాబ్దాల్లో జరిగినవి.  ఈ క్రమంలో చివరిగా 2012లో జరిగింది. అయితే అప్పుడు ఇలాంటి ఆరోపణలు లేవు. ప్రతిపాదనలు వెనక్కి వెళ్లలేదు.  ప్రతిపాదకులను ఒత్తిడికి గురిచేశారని  కాంగ్రెస్​ పార్టీ  ఆరోపిస్తున్నది.  రిటర్నింగ్ అధికారి  నిర్ణయాన్ని పరిశీలించిన ఎన్నికల ప్రక్రియను తిరిగి  ప్రారంభించాలని కాంగ్రెస్​పార్టీ ఎన్నికల కమిషన్​ను ఆశ్రయించింది.  

అనుమానాస్పద, అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్​చర్య తీసుకుంటుందా అనేది సందేహమే. అందుకని రాజ్యాంగంలోని ఆర్టికల్​ 329 (బి) ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించాల్సి ఉంటుంది. కాంగ్రెస్​ పార్టీకి ఉన్న ఏకైక మార్గం గుజరాత్​ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం.  ఈ విచారణను హైకోర్టు ఆరు నెలల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ, ఆ విధంగా పరిష్కరించిన సందర్భాలు లేనేలేవని చెప్పవచ్చు.  దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ చాలాసార్లు అపహాస్యానికి గురవుతూనే ఉంది. ఇప్పడు జరిగింది పరాకాష్ట. న్యాయపరమైన పోటీల ద్వారా గెలిచినప్పుడే అది గెలుపు. నిర్ణయాలు ఎప్పుడూ నిజంవైపు ఉండాలి.  ఆ విధంగా ఆలోచించే రిటర్నింగ్ అధికారులు ఎంతమందనేది  మిలియన్​ డాలర్ల ప్రశ్న. 

చట్టం ఏం చెబుతోంది?

ఈ పరిస్థితుల గురించి చట్టం ఏమి చెబుతుంది?  ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్​ 33 లోక్​సభ ఎన్నికల్లో పోటీచేసే  నిబంధనల  గురించి  తెలియ జేస్తోంది.  25 సంవత్సరాలు కానీ  అంతకు మించి ఉన్న వ్యక్తి  దేశంలో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేయవచ్చు.  అతని  అభ్యర్థిత్వాన్ని  ప్రతిపాదించే  వ్యక్తులు మాత్రం  
ఆ ప్రాంతానికి చెందినవారై ఉండాలి.  గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి నామినేషన్​ ప్రతిపా దించడానికి ఒక వ్యక్తి మాత్రమే అవసరం. ఆ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి  కానీ,  ఏదైనా  చిన్నపార్టీ  నుంచి  పోటీ  చేస్తున్నట్లయితే  అతడి  అభ్యర్థిత్వాన్ని 10మంది ప్రతిపాదిం చాల్సి ఉంటుంది.  

వివిధ ప్రతిపాదకులతో నాలుగు సెట్ల నామినేషన్లను అభ్యర్థి దాఖలు చేసుకోవచ్చు. ఒక సెట్​లో తప్పు ఉన్నా  మిగతా సెట్​ బాగుంటే  అతడి  అభ్యర్థిత్వం  ఆమోదించ బడుతుంది.  సెక్షన్​ 36 ప్రకారం  ఈ నామినేషన్​ పత్రాలను రిటర్నింగ్​ అధికారి ఏ విధంగా  తనిఖీ చేయాలో  చెబుతున్నది.  ప్రధానమైన సమస్య ఉంటే తప్ప అభ్యర్థి నామినేషన్​ పత్రాలను తిరస్కరించ డానికి వీల్లేదు.  అయితే నామినేషన్​ పత్రాల మీద  సంతకాలు నిజమైనవి కాదని వారు గుర్తించినప్పుడు నామినేషన్ను తిరస్కరించవచ్చు. 

- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్​)