ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు అంబానీ ఇళ్లు అంటిలియా గురించి ఆరా తీశారని పోలీసులకు సమాచారం అందడంతో ఆయన నివాసం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసిటివి ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఆయన నివాసానికి సమీపంలో గుర్తించిన ఘటన మర్చిపోక ముందే.. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఓ టాక్సీ డ్రైవర్ నుండి తమకు ఫోన్ వచ్చిందని.. ఇద్దరు ఆగంతకులు.. అంబానీ ఇల్లు ఎక్కడ అని తనను ఆరా తీసినట్లు డ్రైవర్ చెప్పారని పోలీసులు మీడియాకు తెలిపారు. ఆ ఇద్దరి చేతుల్లో పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయని, అనుమానం వచ్చిన టాక్సీ డ్రైవర్ పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్పారు. డ్రైవర్ చెప్పిన విషయాన్ని రికార్డు చేశామన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.