కిడ్నాప్ చేసి, నగ్నంగా ఊరేగించిన మహిళ మృతి

కిడ్నాప్ చేసి, నగ్నంగా ఊరేగించిన మహిళ మృతి

ఇజ్రాయెల్​పై దాడుల్లో భాగంగా.. హమాస్​ చేతుల్లో కిడ్నాప్​కు గురైన జర్మనీ మహిళ మృతి చెందింది. అంతకుముందు ఆమెను కిడ్నాప్ చేసి.. రోడ్లపై నగ్నంగా ఊరేగించారు. తాజాగా ఆమె మరణ వార్తను ఆమె కుటుంబం ప్రకటించింది.

జర్మనీకి చెందిన షానీ లౌక్​ అనే మహిళ.. మ్యూజిక్​ ఫెస్టివల్​లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్​కు వెళ్లింది. అక్టోబర్​ 7న ఈ ఈవెంట్​ జరిగ్గా.. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్​పై యుద్ధం ప్రకటించారు. హమాస్​ బృందం 5వేలకుపైగా రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్​ వీధుల్లో బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంలోనే మ్యూజిక్​ ఫెస్టివల్​లోకి ప్రవేశించి, హింసకు పాల్పడ్డారు. కాల్పుల మోత మోగించారు. అదే సమయంలో షానీ లౌక్​ని ఉగ్రవాదులు కిడ్నాప్​ చేశారు. ఆ తర్వాత.. ఆమెను నగ్నంగా చేసి, ట్రక్​లో వీధుల్లో ఊరేగించారు. ఈ వీడియో అప్పట్లో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. దీంతో పలు ప్రపంచ దేశాలు, హమాస్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అయితే దీని తర్వాత షానీ లౌక్​ ఇప్పుడెక్కడ ఉంది.. అసలు బతికే ఉందా అన్న విషయంపై మాత్రం ఆ వీడియోలో స్పష్టత రాలేదు. తన బిడ్డను కాపాడాలని షానీ లౌక్​ తల్లి రికార్డ.. ప్రపంచ దేశాలను వేడుకున్నారు. సోషల్​ మీడియాలోకి వచ్చి అభ్యర్థనలు చేశారు. కొన్ని గంటల తర్వాత.. మరో అప్డేట్​ ఇచ్చారు. "షానీ లౌక్​కు తీవ్రంగా గాయాలయ్యాయి. గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స ఇస్తున్నార"ని పోస్ట్​ చేశారు. ఈ క్రమంలోనే షానీ లౌక్​ మృతదేహాన్ని గుర్తించినట్టు, పోలీసులు.. ఆమె కుటుంబానికి సమాచారం అందించారు.

"నా సోదరి మరణించిందని చెప్పడం చాలా బాధగా ఉంది. పోలీసులు ఆమెను కనుగొన్నారు. ఆమెను గుర్తించారు. ఆమె మరణించింది" అని షానీ లౌక్​ సోదరి.. ట్విట్టర్​లో పోస్ట్​ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.