బోర్డింగ్ పాస్ ఇవ్వనందుకు ఓ ఎస్సై విమాన సిబ్బందిని కొట్టాడు. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగింది. ఓ ఎస్సై ర్యాంక్ అధికారితో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు ఆలస్యంగా రావడంతో ఎయిర్పోర్టు సిబ్బంది వారికి బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఆ ఎస్సై వారితో గొడవకు దిగాడు. కాసేపటి తర్వాత సహనం కోల్పోయిన ఎస్సై స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ సిబ్బందిని చెంపదెబ్బ కొట్టాడు.
‘నవంబర్ 17న ఓ ఎస్సై సహా ముగ్గురు ప్రయాణీకులు విమానాశ్రయానికి వచ్చారు. వారు ఢిల్లీకి వెళ్లడానికి స్పైస్ జెట్ ఎస్జీ-8194 విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే వారు బోర్డింగ్ సమయానికి కాకుండా లేట్ వచ్చారు. దాంతో వారికి బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. కానీ వారు టికెట్ కౌంటర్ బోర్డింగ్ పాస్ కోసం ఎయిర్లైన్స్ సిబ్బందితో వాదించడం ప్రారంభించారు. చాలాసేపు వాదన తర్వాత బోర్డింగ్ పాస్ ఇవ్వకపోవడంతో సబ్ ఇన్స్పెక్టర్ ఎయిర్లైన్స్ సిబ్బందిని చెంపదెబ్బ కొట్టాడు’ అని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
విమానాశ్రయంలో గొడవ ఎక్కువకావడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి ఎయిర్పోర్ట్ సిబ్బంది సీఐఎస్ఎఫ్ పోలీసులను పిలిచారు. ఆ తర్వాత లేట్గా వచ్చిన ముగ్గురు ప్రయాణీకులతో పాటు విమానయాన సిబ్బందిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే ప్రయాణీకులు, విమానయాన సిబ్బంది పరస్పర అవగాహనతో రాజీకి వచ్చారని, అంతేకాకుండా ముగ్గురిపై ఇచ్చిన ఫిర్యాదును స్పైస్ జెట్ సంస్థ ఉపసంహరించుకుందని పోలీసులు తెలిపారు. కాగా.. గొడవ సద్దుమణిగినా కూడా ఎయిర్ లైన్స్ సిబ్బంది మాత్రం సబ్ ఇన్స్పెక్టర్తో సహా మిగతా ఇద్దరు ప్రయాణికులను విమానంలో ఎక్కడానికి అనుమతించలేదు.
For More News..