పీవీ సింధు.. సైనా నెహ్వాల్.. కిడాంబి శ్రీకాంత్.. సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్.. సాత్విక్ సాయిరాజ్.. చిరాగ్ షెట్టి.. సిక్కి రెడ్డి.. అశ్విని పొన్నప్ప.. వీళ్లంతా ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్స్...! వరల్డ్ బ్యాడ్మింటన్పై తమదైన ముద్ర వేశారు..! చైనా, జపాన్ ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ.. షటిల్ సామ్రాజ్యంలో ఇండియా ఫ్లాగ్ను రెపరెపలాడించారు..! కానీ ఈ మధ్య మన రాకెట్ల స్పీడ్ తగ్గింది..! దీనికి తోడు కరోనా దెబ్బకు పలు టోర్నీలు రద్దు కావడం... సరైన ప్రాక్టీస్ లేకపోవడంతో.. బరిలోకి దిగిన టోర్నీల్లో నిరాశాజనక పెర్ఫామెన్స్తో వెనుకడుగు వేశారు..! ఫలితంగా సైనా, శ్రీకాంత్.. టోక్యో ఒలింపిక్స్కు దూరమయ్యే ప్రమాదం ముంగిట నిలిచారు..! తాజాగా సింగపూర్ ఓపెన్ కూడా రద్దు కావడంతో.. తమ తప్పిదం లేకుండానే ఈ ఇద్దరు మెగా ఈవెంట్కు దూరం కాబోతున్నారు..! అయితే ఒలింపిక్ క్వాలిఫికేషన్పై నిర్ణయం తీసుకుంటామని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించడంతో.. తాను టోక్యోలో బరిలోకి దిగుతానని శ్రీకాంత్ చిన్న ఆశ పెట్టుకున్నాడు..!
హైదరాబాద్: కీలకమైన మలేసియా, సింగపూర్ ఓపెన్ రద్దు కాకపోతే.. తాను కచ్చితంగా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేవాడినని తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ ఆ రెండు టోర్నీలు రద్దు కావడంతో క్వాలిఫికేషన్ నిర్ణయం మొత్తం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) చేతుల్లోకి వెళ్లిందన్నాడు. వాళ్ల నిర్ణయం కోసం వేచి చూడాల్సిన పరిస్తితి తలెత్తిందని, అయినా తాను టోక్యోలో ఆడతానన్న ఏదో ఓ చిన్న ఆశ మాత్రం దాగుందన్నాడు. ‘టోర్నీల రద్దు వల్ల ఓ ప్లేయర్ ఒలింపిక్స్కు దూరం కావడం చాలా నిరుత్సాహాన్ని కలిగించే అంశం. ఇందులో మా తప్పు ఏ మాత్రం లేదు. టెన్నిస్లోలాగా, మా బ్యాడ్మింటన్లోనూ అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తే బాగుండేది. ఎందుకంటే ఓ ప్లేయర్గా మా ఆటలో ఏం జరుగుతోందనేది మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వస్తున్నది. ఒలింపిక్ క్వాలిఫికేషన్ విషయంలో బీడబ్ల్యూఎఫ్ ఎలా ఆలోచిస్తుందో నాకైతే ఐడియా లేదు. ట్విటర్ వేదికగా మా ప్లేయర్లు చెబుతున్న అభిప్రాయాలు, ఆందోళనలపై కనీసం స్పందించడం కూడా లేదు. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే’ అని శ్రీ పేర్కొన్నాడు.
మెరుగ్గా ప్లాన్ చేయాల్సింది
మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానని, కానీ టోర్నీలు ఆడే అవకాశమే లేకుండా పోయిందని శ్రీ వాపోయాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే క్వాలిఫయింగ్ ఈవెంట్లను బీడబ్ల్యూఎఫ్.. బెటర్ క్వారంటైన్ రూల్స్ ఉన్న దేశంలో ప్లాన్ చేయాల్సింది. ఈ ఏడాది ఆరంభంలో థాయ్లాండ్లో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్లను నిర్వహించినట్టు చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం చేయడం, రెండు, మూడు వారాలు క్వారంటైన్లో ఉండి కేవలం ఐదారు రోజులు మాత్రమే ప్రాక్టీస్ చేసి టోర్నీలు ఆడడం అంత ఈజీ కాదు. కరోనా నేపథ్యంలో ఒక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడానికి 50-,50 చాన్సెస్ ఉన్నప్పుడు, చివరకు రద్దయ్యే పరిస్థితులు కూడా ఉన్నప్పుడు దాన్ని షెడ్యూల్ చేయడం ఎందుకు? ఆర్గనైజర్స్, బీడబ్ల్యూఎఫ్ మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దీనివల్లే ఆసియా షట్లర్ల కంటే యూరోపియన్స్ అడ్వాంటేజ్ సాధించారు. వాళ్ల టోర్నీలు జరిగాయి. ఆయా ఈవెంట్లలో ఆడిన ప్లేయర్లు ముఖ్యమైన ర్యాంకింగ్ పాయింట్లు సాధించారు. కొందరు ప్లేయర్లు కరోనా బారిన పడినప్పటికీ ర్యాంకింగ్ పాయింట్లు అందుకున్నారు’ అని కిడాంబి అభిప్రాయపడ్డాడు.
టోర్నీలే లేనప్పుడు ట్రెయినింగ్ ఎందుకు?
టోక్యో ప్రిపరేషన్స్ రోజురోజుకు కష్టంగా మారుతోందని తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించిన సాయి ప్రణీత్ అన్నాడు. అసలు టోర్నీలే లేనప్పుడు ట్రెయినింగ్ ఎందుకు చేయాలని ప్రశ్నించాడు. ‘ఒక టోర్నమెంట్ తర్వాత మరొకటి రద్దు లేదా వాయిదా పడుతున్నాయి. జరగాల్సిన మూడు ఈవెంట్లు రద్దవడం నిరాశ కలిగించింది. నేను ఏడు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు శిక్షణ తీసుకోవడంలో అర్థం లేదనిపిస్తోంది. పోటీలే లేనప్పుడు దీనివల్ల మోటివేట్ అవడం, ఆడడం కష్టంగా మారింది. మేం ట్రెయినింగ్ తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి టోర్నీలు లేకపోవడం కొన్నిసార్లు ఆందోళన కలిగిస్తోంది. తాజా లాక్డౌన్ మాకు మరో సవాల్గా మారింది. ఫిబ్రవరి వరకు అంతా బాగానే అనిపించినా.. ఏప్రిల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఆల్ ఇంగ్లండ్లో దెబ్బపడినప్పటికీ ఇండియా, మలేసియా, సింగపూర్టోర్నీలపై దృష్టి పెట్టాం. కానీ కరోనా సెకండ్ వేవ్ మా ప్లాన్స్ అన్నింటినీ దెబ్బతీసింది. కేవలం ట్రెయినింగ్ సెషన్స్కు మాత్రమే పరిమితం కావడం అనేది చాలా నిరుత్సాహంగా, నిస్తేజంగా అనిపిస్తోంది. నా వరకైతే కనీసం ఒలింపిక్స్ ముందున్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాలని చూస్తున్నా. ఒలింపిక్స్కు ముందు టాప్ ప్లేయర్లందరికీ సన్నాహక టోర్నీలు అవసరం. లేదంటే ఒత్తిడి పెరుగుతుంది’ అని 28 ఏళ్ల ప్రణీత్ చెప్పుకొచ్చాడు.
ప్రాక్టీస్కు బ్రేక్
ఆగస్టు నుంచి ఒక్క టోర్నీ కూడా లేకపోవడం, తెలంగాణలో లాక్డౌన్ పెట్టడంతో ప్రాక్టీస్ నుంచి తాను బ్రేక్ తీసుకున్నట్టు శ్రీకాంత్ తెలిపాడు. ‘ప్రస్తుతానికైతే ప్రాక్టీస్ నుంచి బ్రేక్ తీసుకున్నా. ట్రెయినింగ్కు పర్మిషన్ ఇవ్వాలని మా వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఇస్తే వచ్చే వారం నుంచి మళ్లీ ట్రెయినింగ్ మొదలు పెట్టొచ్చు’ అని చెప్పాడు. మరోవైపు ప్రస్తుతం ఎలాంటి టోర్నీలు లేకపోవడంతో టోక్యోకు క్వాలిఫై అయిన సింధు, సాయిప్రణీత్, డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి కూడా విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గోపీచంద్ అకాడమీ మూత పడింది.
గచ్చిబౌలి స్టేడియంలో కోచ్ పార్క్ సంగ్ సమక్షంలో సింధు స్పెషల్ ట్రెయినింగ్ కూడా ఆగిపోయింది. సోమవారం వరకూ సింధుతో ముమ్మర ప్రాక్టీస్ చేయించిన పార్క్ ఇప్పుడు బ్యాడ్మింటన్ నుంచి పూర్తిగా దృష్టి మళ్లించాలని సూచించాడని సింధు తండ్రి పీవీ రమణ చెప్పాడు. మరోవైపు సాత్విక్ డబుల్స్ పార్ట్నర్ చిరాగ్.. తన హోమ్టౌన్ వెళ్లిపోయాడు.