- రాష్ట్రంలోఅన్నీ పిరమే.. ద్రవ్యోల్బణంలో తెలంగాణే టాప్
- మార్చిలో 7.63%, జనవరిలో 8.58%, ఫిబ్రవరిలో 8.56% గా నమోదు
- జాతీయ సగటు కన్నా మన దగ్గరే ఇన్ఫ్లేషన్రేటు అధికం
- పాలు, కూరగాయలు, పెట్రోల్ వరకు అన్ని ధరలు భగ్గుమంటున్నయ్
- పెరిగిన కరెంట్ చార్జీలు, బస్సు
- కిరాయిలతో సామాన్యుడికి ఇంకిన్ని తిప్పలు
హైదరాబాద్, వెలుగు: దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే అన్నిటి ధరలు భగ్గుమంటున్నాయి. పాలు మొదలు పెట్రోల్ దాకా అన్నీ పిరమైనయ్. అత్యధిక ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రం తెలంగాణే. ఈ ఏడాది వరుసగా మూడు నెలలు ద్రవ్యోల్బణంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. కన్జూమర్ ప్రైసెస్ ఇండెక్స్ (సీపీఐ) రిపోర్ట్ను ఇటీవల ఆర్బీఐ విడుదల చేసింది. అందులో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ టాప్లో నిలిచింది. మార్చి నెలలో 7.63 శాతం ఇన్ఫ్లేషన్ రేట్తో మన రాష్ట్రం ముందుంది. అది జాతీయ సగటు 5.66 శాతంతో పోలిస్తే అధికం. ఫిబ్రవరి, జనవరిలోనూ ఇంత కన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం రికార్డయింది. మన రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ రేటు జనవరిలో 8.58 శాతం, ఫిబ్రవరిలో 8.56 శాతంగా రికార్డయింది. ఆయా నెలల్లోనూ జాతీయ సగటు 6.52 శాతం, 6.44 శాతంతో పోలిస్తే తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఆ రెండు నెలలతో పోలిస్తే మార్చిలో ఇన్ఫ్లేషన్ రేటు కాస్త తగ్గినా.. టాప్లో మాత్రం తెలంగాణే ఉంది. ఇది రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని సూచిస్తున్నది.
2012తో పోలిస్తే ధరలు 80% పైనే పెరిగినయ్
కొన్ని నెలలుగా రాష్ట్రంలో ప్రతి వస్తువు పిరమైంది. పప్పులు, ఉప్పులు, కూరగాయల దగ్గర్నుంచి పెట్రోల్ దాకా అన్ని రేట్లు మండిపోతున్నాయి. 2012 ప్రామాణికంగా 100 బేసిస్ పాయింట్లను లెక్కలోకి తీసుకుంటే.. ప్రస్తుతం అన్ని వస్తువుల రేట్లు 80 శాతానికిపైగానే పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు 77 శాతం ఎక్కువయ్యాయి. బట్టలు, చెప్పుల ధరలూ రెట్టింపయ్యాయి. పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, కూరగాయల ధరలు 80 శాతం కన్నా ఎక్కువయ్యాయి. ఏ కూరగాయలు తీసుకుందామన్నా కిలోకు రూ. 60కి తక్కువ లేదు. ఇటు కందిపప్పు కిలో ధర రకాన్ని బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు పలుకుతున్నది. వంట నూనెల ధరలూ ఎక్కువయ్యాయి. లీటర్ పల్లీ నూనె రూ. 200కు (ఎంఆర్పీ) చేరువైంది. సన్ఫ్లవర్ నూనె ధర కూడా రూ.140 అయింది.
పెట్రోల్, డీజిల్ రేట్లలో తెలంగాణ సెకండ్
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా అధికంగా ఉన్నాయి. నిరుడు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్లను తగ్గించడంతో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వ్యాట్ను తగ్గించుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్పై సగటున రూ.10 వరకు ఆయా రాష్ట్రాల్లో తగ్గింది. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం వ్యాట్ను తగ్గించలేదు. ప్రస్తుతం దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లున్న రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉండగా.. ఆ తర్వాత తెలంగాణలోనే రూ.109.66గా ఉంది. డీజిల్ రేట్లూ అదే స్థాయిలో ఉన్నాయి. ఏపీలో అత్యధికంగా రూ. 98.27కాగా.. తెలంగాణలో రూ.97.82గా ఉంది. నేషనల్ కో ఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకారం.. పాల ధరల్లోనూ తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
ఉత్తరాఖండ్లో లీటర్ పాల ధర సగటున రూ.62 ఉండగా.. తెలంగాణలో రూ.61 ఉంది. కొద్ది నెలల కిందట్నే రాష్ట్ర సర్కారు పాల ధరలను రూ. 2 నుంచి రూ.4 మేర పెంచింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించకపోవడం.. ట్రాన్స్పోర్టేషన్ ధరలూ ఎక్కువ కావడంతో సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారింది. నెలకు రూ. 4 వేలు పెట్టనిదే ఇంట్లో సరుకులు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు ఏదైనా జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్దామన్నా డాక్టర్ ఫీజులూ భారీగా పెరిగాయి. గత ఏడాది వరకు సగటున డాక్టర్ ఓపీ ఫీజులు రూ.400 ఉండగా.. ఇప్పుడు మినిమమ్ కన్సల్టేషన్ ఫీజే రూ.500గా ఉంది. మందుల ధరలు కూడా వంద శాతం పెరిగాయి.