నర్సాపూర్ బరిలో సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్ బరిలో సునీతా లక్ష్మారెడ్డి
  • నర్సాపూర్ బరిలో సునీత లక్ష్మారెడ్డి
  • మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్!
  • బీఫారం అందించిన సీఎం కేసీఆర్
  • గెలుపునకు సహకరించాలని సూచన

హైదరాబాద్ : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ టికెట్ కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బుధవారం ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ నుంచి బీఫారం స్వీకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘మదన్ రెడ్డి గారు నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వారు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుంచి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు ’’అని బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తెలిపారు.

ALSO READ :- దుప్పట్లు, స్వెట్టర్లు తీయండి : హైదరాబాద్లో చలి బాగా పెరుగుతుంది