- ఆమోదం తెలిపిన కేంద్ర కేబినేట్
- ఐదేళ్లలో రూ. 12,195 కోట్ల రాయితీలు
- త్వరలో ల్యాప్టాప్లు, పీసీల తయారీకి కూడా?
న్యూఢిల్లీ: లోకల్గానే టెలికం ఎక్విప్మెంట్ల తయారీని ప్రోత్సహించేందుకు రూ. 12,195 కోట్ల విలువైన పీఎల్ఐ స్కీమ్కు కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రానున్న ఐదేళ్లలో ఈ డబ్బులను రాయితీల కింద కంపెనీలకు ఇస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. మొబైల్స్ తయారీలో ఇప్పటికే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) స్కీమ్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద దేశీయ కంపెనీలతో పాటు, విదేశీ కంపెనీలు కూడా రిజిస్టర్ చేసుకున్నాయి. ఈ స్కీమ్ కింద రిజిస్టర్ అయిన మొబైల్స్ తయారీ కంపెనీ ఒకటి 20 వేల జాబ్స్ను క్రియేట్ చేసిందని ప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాది మరొక కంపెనీ ప్రత్యక్షంగా లక్ష ఉద్యోగాలను , పరోక్షంగా మూడు లక్షల ఉద్యోగాలను ఇస్తుందని అన్నారు. మొబైల్స్ సెగ్మెంట్లో పీఎల్ఐ స్కీమ్ పెద్ద సక్సెస్ అవ్వడంతో ఈ స్కీమ్ కిందకు ఇతర సెక్టార్లను కూడా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. పీఎల్ఐ స్కీమ్ కింద వచ్చే ఐదేళ్లలో రూ. 12,195 కోట్లను టెలికం ఎక్విప్మెంట్ కంపెనీలకు రాయితీలుగా ఇస్తామని ప్రసాద్ అన్నారు. దీంతో దేశంలో వీటి ప్రొడక్షన్ రూ. 2.4 లక్షల కోట్లకు పెరుగుతుందని, ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనావేశారు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని పేర్కొన్నారు. ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ పీసీలు వంటి ఐటీ ప్రొడక్ట్ల తయారీని లోకల్గా పెంచేందుకు ప్రభుత్వం త్వరలో ఓ స్కీమ్ను తీసుకురానుందని చెప్పారు.
5జీ ప్రొడక్ట్స్, ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్స్, రూటర్లు..
టెలికం ఎక్విప్మెంట్ల తయారీలో గ్లోబల్ హబ్గా ఇండియాను నిలిపేందుకు కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రసాద్ అన్నారు. కోర్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్స్, 4జీ/5జీ నెక్స్ట్ జనరేషన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్, వైర్లెస్ ఎక్విప్మెంట్ వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) డివైజ్లు, స్విచ్లు, రూటర్లు వంటి ప్రొడక్ట్ల తయారీ ఈ స్కీమ్ కిందకు రానున్నాయి. ‘మొబైల్, కాంపొనెంట్ల తయారీలో పీఎల్ఐ స్కీమ్ బాగా సక్సెస్ అయ్యింది. కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్న టైమ్ అంటే ఏప్రిల్, 2020 న ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. జులై 31, 2020 చివరి తేదీ అయినప్పటికీ, ఈ స్కీమ్ కింద దేశ, విదేశీ మొబైల్, వీటి కాంపొనెంట్ల తయారీ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఈ సెగ్మెంట్లలో ఉన్న పెద్ద కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేసి, ఇక్కడి నుంచే ఎగుమతులు చేయాలని చూస్తున్నాయి. వేల మందికి ఉద్యోగాలివ్వడానికి ఇవి ముందుకొచ్చాయి. ఈ సక్సెస్తో పీఎల్ఐని టెలికం సెక్టార్కు విస్తరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని ప్రభుత్వం ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
టెలికం దిగుమతులు తగ్గిస్తాం..
రూ. 50 వేల కోట్ల విలువైన టెలికం ఎక్విప్మెంట్లను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులు తగ్గించి, వీటి ప్లేస్ను లోకల్గా తయారైన ప్రొడక్ట్లతో భర్తి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ స్కీమ్కు అర్హత పొందడానికి ప్రభుత్వం పేర్కొన్న మినిమమ్ అమౌంట్ను కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్ల సేల్స్ ప్రభుత్వం పెట్టిన లిమిట్ను దాటి ఉండాలి. మైక్రో, స్మాల్, మీడియం కంపెనీ(ఎంఎస్ఎంఈ)ల కు మొదటి మూడేళ్లలో 1 శాతం ఎక్కువ రాయితీని ఇవ్వాలని కేబినేట్ నిర్ణయించుకుంది. ఎంఎస్ఎంఈలు ఈ స్కీమ్కు ఎలిజిబుల్ కావాలంటే మినిమమ్ రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఇతర కంపెనీలకు రూ. 100 కోట్లుగా ఉంది. టెలికం సెక్టార్లో ఎంఎస్ఎంఈలు ఎదిగేందుకు ఈ స్కీమ్ సాయపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
For More News..