జోషిమఠ్లో భూమి కుంగిపోతున్న ఘటన దేశ ప్రజలకు తీవ్రంగా భయపెడుతోంది. జోషిమఠ్ లో భూమి కుచించుకుపోతున్న ఘటన మరచిపోకముందే.. ఉత్తరాఖండ్లోని మరికొన్ని సిటీల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణప్రయాగ్, ఉత్తరకాశీ, గుప్తకాశీ, రుషికేశ్, నైనిటాల్, ముస్సోరిల్లోనూ ఇండ్లు, రోడ్లు నెర్రెలు వారుతున్నాయి. జోషిమఠ్కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణప్రయాగ్లోనూ చాలా వరకు ఇండ్లకు బీటలు వారడం కనిపించాయి. కొన్ని ఇండ్లైతే కనీసం ఉండేందుకు కూడా పనికి రాకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
కొండలను తవ్వడం వల్లే..
చార్ధామ్ యాత్రకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అక్కడ రుషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు రైల్ లైన్, చార్ధామ్ రోడ్ నెట్వర్క్ను నిర్మిస్తోంది. దీని వల్లే తమ ఇండ్లు బీటలు వారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే.. నైట్ షెల్టర్స్లో తలదాచుకుంటున్నామని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్ హైవేలో ఉన్న బహుగుణనగర్లో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. బహుగుణనగర్లో ఇండ్లు, రోడ్లపై పగుళ్లు వచ్చాయంటున్నారు. కొండలను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం, నిర్మాణాలు చేయడం, చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ వల్లే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు వాపోతున్నారు.
శిథిలావస్థకు ఇండ్లు
మరోవైపు.. రుషికేశ్లోని అటాలీలో దాదాపు 85 ఇండ్లకు క్రాక్స్ వచ్చి శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు అన్ని ఇండ్లు, పొలాల్లో నెర్రెలొచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుషికేశ్, కర్ణప్రయాగ్మధ్య నిర్మిస్తున్న రైల్వే టన్నెల్ వల్లే ఇలా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెహ్రీ గర్హాల్అనే గ్రామంలోనూ భూమి కుంగిపోతోంది. ప్రత్యేకించి తెహ్రీ గర్హాల్ పరిధిలోకి వచ్చే చంబ హామ్లెట్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. చార్ధామ్ కోసం తవ్వుతున్న 440 మీటర్ల పొడవైన టన్నెల్తోనే భూమి కుంగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్యావరణవేత్తల ఆందోళన
వందేళ్ల చరిత్ర ఉన్న ముస్సోరిలోని లాండౌర్ బజార్లో రోడ్ చాలా వరకు కుంగిపోయింది. చాలా షాపులు, ఇండ్లకు క్రాకులు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది ఇప్పుడు ప్రమాదపుటంచున బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. 2018లోనే నైనిటాల్లోని లోయర్ మాల్ రోడ్లో క్రాక్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అక్కడ అదే పరిస్థితి కనిపిస్తోంది. మాల్ రోడ్లో ట్రాఫిక్ పెరగడం, వాహనాల బరువు ఎక్కువ కావడంతో రోడ్డు కుంగిపోతోందని స్థానికులు చెబుతున్నారు. రుద్రప్రయాగ్లో ఉన్న అగస్త్యముని బ్లాక్లోని ఝాలీమఠ్ బస్తీలో పలు ఇండ్లకు నెర్రెలు రావడంతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్నాథ్కు గేట్వేగా చెప్పుకునే గుప్తకాశీ టౌన్లోని పలు ప్రాంతాలు కూడా కుంగిపోతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. వివేకానంద పర్వతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు సమీపంలోని అల్మోరాలో భూమి కుంగిపోవడం చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యతోనే ఇనిస్టిట్యూట్కు సంబంధించిన బిల్డింగ్ను ఇటీవలే కూల్చారు. దాదాపు 15 ఏండ్లుగా ఇక్కడ భూమి కుంగిపోతోందని నిపుణులు కూడా చెబుతుండడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. పెరిగిన జనాభా, పర్యాటకులకు తగ్గట్టు సరైన ప్రణాళిక లేకుండా భారీ కట్టడాలను నిర్మించడం, ప్రాజెక్టులను చేపట్టడం వంటి కారణాల వల్లే ఉత్తరాఖండ్లోని పట్టణాల్లో భూమి కుంగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.