- 2023–24 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా ఉంటుందన్న ఆర్బీఐ ఎంపీసీ
- ఇన్ఫ్లేషన్ 5.4 శాతం
- కోఆపరేటివ్ బ్యాంకుల్లో రూ. 4 లక్షల వరకు గోల్డ్ లోన్
బిజినెస్ డెస్క్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. గ్లోబల్ ఎకానమీ గ్రోత్ మందగించినా, మన దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని చెప్పారు. కిందటి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్లో వేసిన జీడీపీ అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. దేశం ముందుకు వెళ్లాలంటే మాక్రో ఎకానమీ స్టేబుల్గా ఉండాలని, ఇంక్లూజివ్ (అందరిని కలుపుకుంటూ) గ్రోత్ అవసరమని కౌటిల్య అర్థశాస్త్రాన్ని కోట్ చేస్తూ ఆయన పేర్కొన్నారు. దేశ జీడీపీ సెప్టెంబర్ క్వార్టర్లో 6.5 శాతం, డిసెంబర్ క్వార్టర్లో 6 శాతం, మార్చి క్వార్టర్లో 5.7 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ1లో జీడీపీ గ్రోత్ రేట్ 6.6 శాతంగా ఉంటుందని వెల్లడించింది. 2023–24 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతం ఉంటుందని ఆగస్టు మీటింగ్లోనూ ఆర్బీఐ ఎంపీసీ లెక్కించింది.
తగ్గనున్న ఇన్ఫ్లేషన్
టమోట వంటి కూరగాయల ధరలు పెరగడంతో జులైలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 7.44 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. జులై, ఆగస్టు (6.88 శాతం) లో నెలకొన్న ఇన్ఫ్లేషన్ ఒత్తిళ్లు తగ్గాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 5.4 శాతంగా రికార్డవుతుందని లెక్కించారు. సెప్టెంబర్ క్వార్టర్లో 6.4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 5.6 శాతంగా, మార్చి క్వార్టర్లో 5.2 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆగస్టు మీటింగ్లోనూ 2023–24 లో ఇన్ఫ్లేషన్ 5.4 శాతంగా ఉంటుందని లెక్కించింది. ఆర్థిక వ్యవస్థ గ్రోత్ బాటలో ఉన్న టైమ్లో ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో ఈ ఏడాది జులై–ఆగస్టులో ఇన్ఫ్లేషన్ పెరిగిందని శక్తికాంత దాస్ అన్నారు. క్రూడాయిల్ ధరల్లో వోలటాలిటీ, జియో పొలిటికల్ టెన్షన్లు ఇంకా తగ్గకపోవడం, దేశంలో వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడంతో ఇన్ఫ్లేషన్ ఔట్లుక్పై అనిశ్చితి నెలకొందని వెల్లడించారు. కూరగాయలు ధరలు ముఖ్యంగా టమోట ధరలు తగ్గడంతో సమీప కాలంలో ఇన్ఫ్లేషన్ దిగొస్తుందని అభిప్రాయపడ్డారు.
రూ.12 వేల కోట్లు ఇంకా రాలే..
సుమారు రూ.12 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఇంకా బ్యాంకుల్లోకి రాలేదని శక్తికాంత దాస్ వెల్లడించారు. డిపాజిట్లు, ఎక్స్చేంజి మార్గంలో 87 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని అన్నారు. వ్యవస్థలోని రూ.2 వేల నోట్లను విత్డ్రా చేసుకుంటామని ఈ ఏడాది మే 19 న ఆర్బీఐ ప్రకటించింది. ఆ టైమ్లో రూ.3.56 లక్షల కోట్ల రెండు వేల రూపాయిల నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. కాగా, రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఈ నెల 7 (శనివారం) చివరి తేది.
రెపో రేటు మార్చలే
వరుసగా నాలుగో మీటింగ్లోనూ రెపో రేటును మార్చకుండా 6.50 శాతం దగ్గరే కొనసాగించడానికి ఆర్బీఐ ఎంపీసీ మొగ్గు చూపింది. విత్డ్రాయల్ అకామిడేషన్ (మానిటరీ పాలసీని సులభం చేయడం) వైఖరీని కొనసాగించింది. ఇన్ఫ్లేషన్ను 4 శాతం దిగువకు తేవడంపై ఫోకస్ పెట్టామని వివరించింది. గతంలో రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచామని, దీని ప్రభావం వ్యవస్థలో ఇంకా పూర్తిగా వెళ్లలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) ను 6.25 శాతం దగ్గర, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని 6.75 శాతం దగ్గర ఆర్బీఐ ఎంపీసీ కొనసాగించింది. బ్యాంకుల ఎన్డీటీఎల్ (నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ (ఇతర బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు మైనస్ లయబిలిటీస్)) పై ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్) ను 10 శాతం ఇస్తున్నారు. ఇది శనివారంతో ముగియనుంది. మానిటరీ పాలసీకి తగ్గట్టు వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్పై దృష్టి పెడతామని శక్తికాంత దాస్ వెల్లడించారు. బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు ఇచ్చే గోల్డ్ లోన్ల లిమిట్ను రెండింతలు పెంచి రూ.4 లక్షలకు ఆర్బీఐ పొడిగించింది.