
- రామన్నగూడెం నుంచి పాల్వంచ వరకు 70 కిలోమీటర్లు పాదయాత్ర
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెంలో గల 30, 36, 39 సర్వే నంబర్లలోని భూములను తమకు అప్పగించాలని పలువురు ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం 200 మంది ఆదివాసీలు సుమారు 70 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి పాల్వంచ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు, స్వరూప మాట్లాడుతూ 30, 36, 39 సర్వే నంబర్లలోని భూములను తమకు అప్పగించాలని 2011లోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అప్పటి కలెక్టర్ భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. అటవీ అభివృద్ధి సంస్థ తిరిగి కోర్టులో కేసు వేసిందని.. 2015లోనూ తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనేకసార్లు ఆందోళనలు నిర్వహించినా ఎవరూ స్పందించడం లేదన్నారు.
ఇప్పటికైనా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సర్వే నిర్వహించి భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ ఆదివాసీలతో మాట్లాడారు. ప్రస్తుతం కలెక్టర్ సెలవులో ఉన్నారని, ఆయన వచ్చిన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు రాజకుమారి, విజయ, రమాదేవి, పద్మ, సత్యవతి, సారమ్మ, రాములమ్మ, రాజమ్మ, లక్ష్మి, పోలమ్మ, కాంతమ్మ, వెంకటమ్మ, మంగపాల్గొన్నారు.