హుజురాబాద్ ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బరిలో దింపింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది ఇంకా తేల్చుకోలేకపోతోంది. ఇటు బీజేపీ, టీఆర్ఎస్ ఎప్పటి నుంచో నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఆ ఒక్క నియోజజక వర్గమే టార్గెట్గా మంత్రులందరినీ అక్కడికి క్యూ కట్టిస్తోంది.
ఈ నెల 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఈ ప్రచార పర్వం మరో లెవల్కు చేరింది. ఇవాళ తాజాగా టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి తరఫున హుజురాబాద్లో ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్కు అందజేసింది. సీఎం కేసీఆర్ సహా మొత్తం 20 మంది నేతల పేర్లను ఈ లిస్టులో చేర్చింది.
వీరే ఆ స్టార్ క్యాంపెయినర్లు..
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లను స్టార్ క్యాంపెనర్లుగా బరిలోకి దించుతోంది టీఆర్ఎస్. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుంకే రవి శంకర్, బాల్క సుమన్, చల్లా ధర్మా రెడ్డి, వి. సతీశ్ కుమార్, గువ్వల బాలరాజ్, ఆరూరి రమేశ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, కనుమల్ల విజయ వంటి నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొంటూ టీఆర్ఎస్ పార్టీ ఈసీకి జాబితా పంపింది.