
- పంజాబ్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
- యూపీలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
న్యూఢిల్లీ/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం పంజాబ్లోని అన్ని స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని 59 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే యూపీలో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఆదివారం జరిగేది థర్డ్ ఫేజ్. ప్రస్తుతం పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పవర్లోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్, బీజేపీ తదితర పార్టీలు కూడా సత్తా చాటాలని భావిస్తున్నాయి.
పంజాబ్లో 117 సీట్లు.. బరిలో 1,304 మంది
పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం ఒకే ఫేజ్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ మొత్తం 117 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. 1,304 మంది క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు. 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, ఆప్, ఎస్ఏడీ–బీఎస్పీ కూటమి, బీజేపీ–పీఎల్సీ–ఎస్ఏడీ(సంయుక్త్) కూటమి, సంయుక్త్ సమాజ్ మోర్చా మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పలు రైతు సంఘాల నేతలు కూడా బరిలో ఉన్నారు. శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) ఈ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం చరణ్జిత్సింగ్ చన్నీ, ఆప్ సీఎం క్యాండిడేట్ భగవంత్ మాన్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దు, మాజీ సీఎంలు అమరీందర్, ప్రకాశ్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్బీర్సింగ్ బాదల్, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ శర్మ వంటి కీలక నేతలు బరిలో ఉన్నారు. పంజాబ్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వరుసగా 10 ఏండ్ల పాటు పంజాబ్ను పాలించిన ఎస్ఏడీ–బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ 77 సీట్లలో విజయం సాధించగా.. ఎస్ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆప్ 20 చోట్ల గెలిచింది.
యూపీలో థర్డ్ ఫేజ్
ఉత్తరప్రదేశ్లో ఆదివారం థర్డ్ఫేజ్ఎన్నికలు జరుగనున్నాయి. ఈ దశలో 16 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. 627 మంది క్యాండిడేట్స్ పోటీ పడుతుండగా.. 2.15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ ఇయ్యాల్నే. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ పోటీ చేస్తున్నారు. కర్హాల్ పోలింగ్కు పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది. 2017 ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ 49 చోట్ల విజయం సాధించగా.. సమాజ్వాదీ పార్టీ 9 చోట్ల గెలిచింది. మరో స్థానంలో కాంగ్రెస్ గెలుచుకుంది.
For More News..