ఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లేలా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. దేవుళ్లు, మతంపై బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. అయోధ్యలో జనవరి 22 రామమందిరం వేడుక రాజకీయంగా జరిగింది. ఇది ఓ రాజకీయ వ్యక్తి కోసం జరిగిందని మండిపడ్డారు. మేం రాముడిని ఆరాధించేవాళ్లం, వాళ్లు (బీజేపీ) రాముడిని అడ్డంపెట్టుకుని వ్యాపారం చేసే వాళ్లని ధ్వజమెత్తారాయన. మతాన్ని రాజకీయం చేయడం వల్ల.. మతం, రాజకీయాలు కూడా దిగజారిపోతాయన్నారు.
Also Read :తెలుగులో ట్వీట్ .. మోదీ ఉగాది శుభాకాంక్షలు
ఇంటింటికి కాంగ్రెస్ హామీలు చేరేలా కార్యక్రమాన్ని ప్రారంభించామని జైరామ్ రమేష్ తెలిపారు. 8 కోట్ల గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తమకు ప్రధానంగా ముగ్గురు సూపర్ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్న ఆయన.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని జైరామ్ రమేష్ చెప్పారు.