నల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. సరఫరా చేయడానికి సరిపడా బొగ్గు ‘కోల్ ఇండియా’ దగ్గర ఉందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సినంత బొగ్గు ఉందంటోంది. కానీ.. థర్మల్ పవర్ స్టేషన్లలో మాత్రం కొన్ని రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. అసలు ఈ కొరతకు కారణాలేంటి? కరెంట్ అవసరం ఒక్కసారిగా ఎందుకు పెరిగింది?
కొన్ని రోజుల నుంచి బొగ్గు కొరతకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత తప్పదనే అంటున్నారు ఎక్స్పర్ట్స్. మనది ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా మునుపెన్నడూ లేని విధంగా కరెంట్ సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 70 శాతం ఎలక్ట్రిసిటీ థర్మల్ ప్లాంట్ల నుంచే వస్తుంది. అయితే.. కొన్నాళ్ళ క్రితం కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీలు మూత పడ్డాయి. దాంతో కరెంట్ వినియోగం తగ్గింది. ఆ తర్వాత కంపెనీలు తెరిచినా థర్డ్ వేవ్ భయంతో పూర్తి ఆక్యుపెన్సీతో పనిచేయలేదు. తక్కువ స్టాఫ్తో తక్కువ ప్రొడ్యూస్ చేశాయి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు పూర్తి కెపాసిటీతో పనిచేస్తున్నాయి. దానివల్ల కరెంట్ వాడకం బాగా పెరిగింది. ప్రొడక్షన్ పెంచాల్సి వచ్చింది. కానీ.. ప్రొడక్షన్కి తగ్గట్టు బొగ్గు సరఫరా జరగడం లేదు. దానివల్ల నిల్వలు తగ్గుతున్నాయి. ఈ కొరత ఇలాగే కొనసాగితే ఈ ఎఫెక్ట్ దాదాపు అన్ని రంగాల మీద పడే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
దేశంలో బొగ్గు కొరత ఉందని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి చెప్పినా.. కేంద్రం మాత్రం పరిస్థితులు బాగానే ఉన్నాయని అవసరమైనంత బొగ్గు సరఫరా చేయడానికి రెడీగా ఉన్నామని చెబుతోంది. కాకపోతే ప్లాంట్లలో నిల్వలు తక్కువగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. పైగా ‘‘ఎవరికి కావాలో చెప్పండి. సప్లై చేస్తాం” అంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. కానీ.. అది కేవలం స్టోరేజీ మాత్రమే ప్రతి రోజూ సప్లై జరుగుతూనే ఉందన్నారు. దీంతో అసలు బొగ్గు కొరత ఉందా? లేదా? అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే.. పరిస్థితులను బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నదనే తెలుస్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు బాగా పెరిగాయి. పొరుగు దేశం చైనాలో బొగ్గు కొరత వల్లే కరెంట్ ప్రొడక్షన్ బాగా తగ్గింది. పరిశ్రమలతోపాటు ఇళ్లకు కూడా కరెంటు కోతలు పెడుతున్నారు. అదే పరిస్థితి మనకూ వచ్చే ప్రమాదముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, ఏపీ వంటి రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఎక్కువగా ఉంటున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
మనకూ సమస్యేనా?
సింగరేణి బొగ్గు గనులు మన రాష్ట్రంలోనే ఉన్నా.. రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్లలో మామూలుగా 15 రోజులకు సరిపడా బొగ్గు స్టోర్ చేస్తారు. కానీ.. ఇప్పుడు నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు, ఈ స్టేషన్లకు తక్కువగా సప్లై చేస్తూ, కొరతతో ప్రొడక్షన్ ఆగిపోయే స్థితిలో ఉన్న స్టేషన్లకు సింగరేణి సంస్థ బొగ్గు సప్లై చేస్తోందని తెలుస్తోంది. కానీ.. వర్షాల వల్ల కొన్నాళ్ల సింగరేణిలో ప్రొడక్షన్ తగ్గినా ఇప్పుడు మళ్లీ మెరుగుపడింది. ఇప్పుడు రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తోంది. అందులో తెలంగాణలోని థర్మల్ పవర్ స్టేషన్లకు 30,000 టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. మిగతాది కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లకు సరఫరా అవుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రి జగదీష్రెడ్డి తెలంగాణలో ఎటువంటి సమస్య రాదని తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్”(TSGENCO) ప్రకారం.. తెలంగాణలో థర్మల్ పవర్ స్టేషన్లలో 3,772.5 మెగావాట్ల కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ప్రస్తుతం 3.8 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి చెప్పారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం దగ్గర ఉన్న 2,600 మెగావాట్ల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పవర్ స్టేషన్ కూడా తెలంగాణలో కరెంట్ సరఫరాకు సాయం చేస్తుంది. అంతేకాకుండా తెలంగాణలో హైడల్ పవర్ కెపాసిటీ 2,441.8 మెగావాట్లు.
‘పిట్హెడ్’ కాబట్టి ఇబ్బంది లేదు
బొగ్గు గనులకు 50 కిలోమీటర్లలోపు ఉండే థర్మల్ పవర్ ప్లాంట్లను ‘పిట్హెడ్’ అంటారు. వీటికి బొగ్గును అందించడం పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల ట్రాన్స్పోర్టేషన్ టైం, ఖర్చు కూడా చాలా తక్కువ. మన దగ్గర ఎక్కువగా ‘పిట్హెడ్’ ప్లాంట్లే ఉన్నాయి. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
కొరత ఎందుకొచ్చింది?
పొరుగుదేశం చైనాలో కూడా కరెంట్ కొరత ఏర్పడింది. కొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఆ పరిస్థితి మనకు రాకూడదనే బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఇంటర్-మినిస్టీరియల్ సబ్-గ్రూప్ వారానికి రెండుసార్లు బొగ్గు స్టాక్ పరిస్థితి గురించి తెలుసుకుంటోంది. సమస్యలను పరిష్కరిస్తోంది. కరోనా లాక్డౌన్, వర్షాలు, ఫ్యాక్టరీలు ఎక్కువ కరెంట్ వాడడం ఇలా.. బొగ్గు కొరత ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్:
లాక్డౌన్ వల్ల స్టాఫ్ని తగ్గించుకున్న ఫ్యాక్టరీలు మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయేమోననే భయంతో పూర్తి ఆక్యూపెన్సీతో ప్రొడక్షన్ మొదలుపెట్టలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ తేరుకున్నాయి. స్టాఫ్ని పెంచుకుని పూర్తి కెపాసిటీతో ప్రొడక్షన్ మొదలుపెట్టాయి. మళ్లీ మామూలు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా కరెంట్కు డిమాండ్ పెరిగింది. కరెంట్ వాడకం పెరగడం వల్ల దాని ప్రొడక్షన్కు ఉపయోగించే బొగ్గుకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. అందుకే కొరత ఏర్పడింది. ఈ మధ్యే దేశంలో కరెంట్ వాడకం రోజుకు 4 బిలియన్ యూనిట్లు దాటింది. ఇందులో 65 నుండి 70 శాతం బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోంది. 2019 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నెలకు దాదాపు 106.6 బిలియన్ యూనిట్లు, అదే 2021లో నెలకు 124.2 బిలియన్ యూనిట్లు కన్జ్యూమ్ అయింది.
వర్షాలు:
ఈ ఏడాది సెప్టెంబర్లో బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయి. దాంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో నీళ్లు నిండడం వల్ల కోల్ ప్రొడక్షన్ తగ్గింది. ఈ సమస్య దాదాపు ప్రతి ఏటా ఉంటుంది. కానీ.. ఈ సారి డిమాండ్ పెరిగి, ప్రొడక్షన్ తగ్గడంతో కొరత ఏర్పడింది. రుతుపవనాల మొదలవడానికి ముందే ఎక్కువ బొగ్గును స్టోర్ చేసుకోగలిగితే ఈ సమస్య వచ్చేది కాదు.
ఇంటర్నేషనల్ మార్కెట్:
అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు బాగా పెరిగాయి. మనం ఎక్కువగా ఇండోనేసియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ఇండోనేసియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధర మార్చి -2021లో టన్నుకు 60 డాలర్లుగా ఉంది. అదే (సెప్టెంబర్, అక్టోబర్ లో 160 డాలర్లకు పెరిగింది. దానివల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్లాంట్లలో ప్రొడక్షన్ తగ్గింది. 2019తో పోల్చితే ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసుకుంటున్న బొగ్గుతో ప్రొడ్యూస్ చేసే కరెంట్ 2021లో 43.6 శాతం తగ్గింది. దీంతో బొగ్గు కొరతను తగ్గించేందుకు కోల్ ఇండియా బొగ్గు ప్రొడక్షన్ను పెంచింది. అక్టోబర్ 7 న, కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) 1.501 మిలియన్ టన్నుల బొగ్గును సప్లై చేసింది. దానివల్ల వాడకానికి, సప్లైకి మధ్య ఉన్న తేడాని తగ్గించింది. సప్లై క్రమంగా పెంచాలని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది.
అందరికీ ఇదే పరిస్థితి
మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ధరల పెరుగుదల, పెట్రోల్ సంక్షోభం వంటివి ఇబ్బందికరంగా మారాయి. యూరప్లో నేచురల్ గ్యాస్ ధర ఈ ఏడాది దాదాపు నాలుగింతలు పెరిగింది. ఇక కరెంట్ చార్జీలు మూడింతలు పెరిగాయి. మన దేశంలో కూడా పెట్రోల్, వంట గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో ఏకంగా ఫుడ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
వేరే దారులేంటి?
ఇప్పుడొచ్చిన సమస్యే భవిష్యత్తులో కూడా వస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. అందుకే థర్మల్ పవర్కు బదులుగా ఇతర అవకాశాలను కూడా వాడుకుని కరెంట్ ప్రొడ్యూస్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అవేంటంటే..
సోలార్ పవర్
సోలార్ పవర్ కొన్నేళ్ల నుంచి ఎక్కువగా వాడకంలోకి వచ్చింది. ఈ మధ్యే ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. పైగా సోలార్-ప్యానెల్ ధరలు కూడా బాగా తగ్గాయి. కాబట్టి సోలార్ పవర్ ప్రొడక్షన్ను అన్ని దేశాలు పెంచుకుంటే భవిష్యత్తులో కరెంట్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా దీని ప్రొడక్షన్కు తక్కువ ఖర్చవుతుంది. దీనివల్ల వనరులను కాపాడడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించినవాళ్లం అవుతాం. కాకపోతే ఇందులో కూడా సమస్యలు ఉన్నాయి. ఎండ ఎక్కువగా ఉంటేనే కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది.
విండ్ పవర్
గాలితో కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. విండ్ పవర్ను కరెంట్గా మార్చడానికి విండ్ టర్బైన్లను వాడతారు. దీనికి మెకానికల్ పవర్ కోసం గాలి మరలను వాడతారు. కాకపోతే ఇది గాలి ఎక్కువగా వీచినప్పుడే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఖర్చయ్యే కరెంట్లో విండ్ పవర్తో దాదాపు రెండు శాతం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
నేచురల్ గ్యాస్
నేచురల్ గ్యాస్ టర్బైన్లు, ఆవిరి టర్బైన్లను వాడి కరెంట్ను ఉత్పత్తి చేయొచ్చు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల కంటే నేచురల్ గ్యాస్ మండించడం వల్ల తక్కువ కాలుష్యం అవుతుంది. ఇది చాలా తక్కువ కార్బన్ డై ఆక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. కాబట్టి థర్మల్ పవర్ కంటే నేచురల్ గ్యాస్తో కరెంట్ను ప్రొడ్యూస్ చేయడమే బెటర్. నేచురల్ గ్యాస్ వల్ల పెట్రోలియంను కాల్చడం కంటే 30% తక్కువ, బొగ్గును కాల్చడం కంటే 45% తక్కువ కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది.
న్యూక్లియర్ పవర్
న్యూక్లియర్ ఫూజన్ ద్వారా ఇది పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది థర్మల్ పవర్ కంటే బెటర్. ఎందుకంటే ఇందులో కార్బన్ ప్రొడ్యూస్ అవ్వదు. థర్మల్ నుంచి న్యూక్లియర్ పవర్కి మారడం వల్ల డీకార్బోనైజింగ్ అవుతుంది. కానీ.. న్యూక్లియర్ పవర్ స్టేషన్ల సేఫ్టీపై ఎన్నో భయాలు ఉన్నాయి. అందుకే మన దేశంలో అణు విద్యుత్ చాలా తక్కువగానే ఉత్పత్తి అవుతుంది.
కొరత రాకుండా ఏం చేయాలి?
బొగ్గు కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వర్షాలు, వరదల వల్ల సెప్టెంబర్లో బొగ్గు ప్రొడక్షన్ తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. వర్షాకాలం రాకముందే ఎక్కువగా తవ్వి స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే.. ఎలాగూ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైడల్ పవర్ జనరేషన్ కెపాసిటీని పెంచుకోవాలి. సెప్టెంబరు 30 వరకు గడిచిన ఆరు నెలల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నుండి 14%, మాత్రమే కరెంట్ ప్రొడ్యూస్ అయింది. డ్యామ్ల దగ్గర మరిన్ని హైడ్రో పవర్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని అల్యూమినియం, సిమెంట్ కంపెనీలు ఎక్కువగా బొగ్గును కొంటుంటాయి. ఆ కొనుగోళ్ల మీద కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ ఉండాలి.
ఇండస్ట్రీలపై ఎఫెక్ట్
దేశంలో బొగ్గుకు డిమాండ్ పెరుగుతుండడం వల్ల రిఫైనరీల నుంచి అల్యూమినియం, మాంసం ప్రాసెసింగ్ చేసే సంస్థల వరకు చాలా కంపెనీలపై ఎఫెక్ట్ పడుతోంది. ఎక్కువ ఎఫెక్ట్ పడే కంపెనీలు ఇవి..
పెట్రోలియం:
పవర్ రేషన్ పరిస్థితి మరింత దిగజారితే... పెట్రోలియం రంగం మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. అయితే.. పెట్రోలియం రిఫైనరీలకు ఎక్కువగా కరెంట్ అవసరం ఉంటుంది. ఒకవేళ వాటికి సరిపడా కరెంట్ అందించకపోతే వాళ్లకున్న క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల నుంచి పవర్ జనరేట్ చేసుకుంటారు. అయితే.. వాటిలో చాలా యూనిట్లు గ్యాస్ ద్వారా నడుస్తాయి. దానివల్ల నేచురల్ గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ రంగంలో ప్లాస్టిక్, ఫైబర్, సింథటిక్ రబ్బర్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెహికల్ టైర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ తయారుచేసే వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు. కొన్ని పరిశ్రమలకు సొంత పవర్ యూనిట్లు ఉండవు. అందుకని ప్రొడక్షన్ ఆగకుండా ఉండేందుకు వాళ్లు డీజిల్ జనరేటర్లను వాడతారు. దాంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఈ ప్రభావం ధరల మీద కూడా పడుతుంది.
స్టీల్:
ఇండియాలో పెద్ద స్టీల్ ఫ్యాక్టరీలకు సొంత పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్లు బొగ్గును వేలం పాటలో కొనుక్కుంటారు. ప్రస్తుతం ఇది మామూలు ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీఆర్ శర్మ అన్నారు. దీన్ని బట్టి అల్యూమినియం ధరల మీద కూడా ఎక్కువగానే ఎఫెక్ట్ పడుతుంది. ఇక చిన్న చిన్న ఫ్యాక్టరీలు సొంతంగా కరెంట్ను తయారుచేసుకోలేవు. కాబట్టి వీటిలో ప్రొడక్షన్పై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ‘‘ఇంటిగ్రేటెడ్ సెకండరీ స్టీల్ మిల్లులు లేదా స్టాండలోన్ స్పాంజ్ ఐరన్ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువగా బొగ్గుపై ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది.
అల్యూమినియం
అల్యూమినియం కంపెనీలు బొగ్గును ఎక్కువగా వాడుతుంటాయి. దిగుమతి చేసుకున్న, వేలంలో కొన్న బొగ్గును వాడి ప్లాంట్లను నడుపుతుంటారు. ఇప్పుడు బొగ్గు ధరలు పెరగడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ దాదాపు 40 వాతం పెరుగుతోంది. అయితే.. అల్యూమినియం పరిశ్రమలపై ఇప్పటివరకు ప్రభావం చూపనప్పటికీ భవిష్యత్తులో కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీల ప్లాంట్లలో ఒకట్రెండు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి.
మాంసం
పౌల్ట్రీ, మాంసం, డైరీ వంటి రంగాల మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. కరెంట్ లేనప్పుడు ఈ సంస్థలు డీజిల్ పవర్ జనరేటర్లను బ్యాకప్గా వాడతాయి. దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆ ఎఫెక్ట్ ధరలపై పడుతుంది. వీటితోపాటు ఇటుకల పరిశ్రమపై కూడా బొగ్గు కొరత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ పరిశ్రమల్లో బొగ్గు, బయోమాస్ వంటి ఘన ఇంధనాలను వాడతారు.
::: సగన్