లోకలైజేషన్ రూల్స్ పాటిస్తోందన్న ఎన్పీసీఐ
సెర్ట్ ఆడిట్ రిపోర్ట్తో ఆర్బీఐ ఓకే
త్వరలో గ్రాండ్ లాంఛ్
మిగిలిన యూపీఐ ప్లాట్ఫామ్లకు తప్పని పోటీ
న్యూఢిల్లీ: ఎట్టకేలకు వాట్సాప్ పేమెంట్స్కు లైన్ క్లీయరైనట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లనుంచి రెగ్యులేటరీ క్లీయరెన్స్ల కోసం చూస్తున్న ఈ కంపెనీకి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) నుంచి అనుమతులు లభించాయి. డేటా లోకలైజేషన్ రూల్స్ను వాట్సాప్ పేమెంట్స్ ఫాలో అవుతోందని ఆర్బీఐకి ఎన్పీసీఐ తెలియజేసింది. వాట్సాప్ పేమెంట్స్ పైలట్ సర్వీస్లపై సుప్రీం కోర్టులో ఓ పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ను రిజర్వ్బ్యాంక్(ఆర్బీఐ) ఫైల్చేసింది. డేటా స్టోరేజ్ నిబంధనలను వాట్సాప్ పేమెంట్స్ చేరుకుందని, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ప్లాట్ఫామ్లోకి వెళ్లేందుకు ఈ కంపెనీ రెడీగా ఉందనే విషయాన్ని ఎన్పీసీఐ తమకు చెప్పిందని ఆర్బీఐ ఈ అఫిడవిట్లో పేర్కొంది. సెర్ట్–ఇన్ (కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీం) ఆడిట్ రిపోర్ట్ల ప్రకారం డేటా లోకలైజేషన్ అవసరాలను వాట్సాప్ చేరుకుందని ఆర్బీఐ తెలిపింది. పేమెంట్ సర్వీస్లను లాంఛ్ చేసేందుకు వాట్సాప్ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్ ఐసీఐసీఐ బ్యాంక్కు అనుమతిస్తున్నామని అఫిడవిట్లో ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ డేటా లోకలైజేషన్ రూల్స్ ప్రకారం పేమెంట్స్డేటా, సెటిల్మెంట్ ట్రాన్స్క్షన్స్కు చెందిన సమాచారం, కస్టమర్డేటా వంటివి ఇండియాలోనే స్టోర్కావాల్సి ఉంది. ఇండియన్ యూజర్లకు పేమెంట్ సర్వీస్లను అందించేందుకు వాట్సాప్ పేమెంట్స్ రెడీగా ఉందని వాట్సాప్ ప్రతినిధి అన్నారు. డేటా లోకలైజేషన్ రూల్స్ను వాట్సాప్ఫాలో అవ్వడంపై ఎన్పీసీఐ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. ఈ రూల్స్కు అనుగుణంగా మారడానికి మా టీం గత ఏడాది కాలం నుంచి పనిచేస్తోందని అన్నారు. ప్రస్తుతం ఎన్పీసీఐ నుంచి అనుమతులొచ్చాయని, ఇక ఆపడానికి ఎటువంటి అడ్డంకులు లేవన్నారు. వాట్సాప్ కొంత మంది యూజర్లకు ట్రయల్ బేసిస్లో వాట్సాప్ పేమెంట్ సర్వీస్లను అందిస్తోంది.
గూగుల్ పేకు గట్టి పోటీ..
ఫైనాన్షియల్ డేటా ఇండియాలోనే స్టోర్ చేయాలనే రూల్ను ఆర్బీఐ 2018లో తీసుకొచ్చింది.అప్పటి నుంచి ప్రభుత్వానికి, విదేశీ కంపెనీలకు మధ్య డేటా లోకలైజేషన్పై ఇష్యూ నడుస్తోంది. ఇండియాలో డేటా స్టోరేజిలను ఏర్పాటు చేయడం ద్వారా అదనంగా ఖర్చు పెరుగుతుందని ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలు మొదట్లో ఆందోళన చెందాయి. కానీ, తర్వాత ఈ కంపెనీలు డేటా లోకలైజేషన్ రూల్స్ను అంగీకరించక తప్పలేదు. యూపీఐ ప్లాట్ఫామ్ను వాడుతున్నఅన్ని పేమెంట్ సర్వీసెస్ ప్లాట్ఫామ్లు డేటా లోకలైజేషన్ రూల్స్ ఫాలో అవుతున్నాయని ఎన్పీసీఐ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి వాట్సాప్ పేమెంట్స్ రెండేళ్ల కిందటే తమ పైలట్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చింది. యూపీఐ బేస్డ్ పేమెంట్స్ను దేశం మొత్తం మీద లాంఛ్ చేయడానికి రెగ్యులేటరీ క్లియరింగ్స్ కోసం వాట్సాప్ ఇప్పటి వరకు ఎదురు చూసింది. ప్రస్తుతం ఫేస్బుక్కు చెందిన ఈకంపెనీకి ఇండియాలో 40 కోట్ల మంది యూజర్లున్నారు. ఇది వాట్సాప్ పేమెంట్స్కు ప్లస్ కానుంది. ఇప్పటికే యూపీఐ బేస్డ్ పేమెంట్స్ సిస్టమ్లో మార్కెట్ లీడర్గా ఉన్న గూగుల్పేకు వాట్సాప్ పేమెంట్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది మే నాటికి యూపీఐ పేమెంట్స్ సర్వీసెస్లో గూగుల్ పే కు 42శాతం వాటా ఉంది. ఫ్లిప్కార్ట్కు చెందిన ఫోన్ పేకు 35 శాతం వాటా, పేటీఎం, అమెజాన్ పే,భారత్ పే వంటి ఇతర ప్లాట్ ఫామ్లకు 23 శాతం వాటా ఉంది. బెనిఫిషరీ బ్యాంక్ డిటైల్స్ను బయటపెట్టకుండానే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూపీఐ అవకాశం కల్పిస్తోంది. జులై నెలలో ఏకంగా 1.49 బిలియన్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరగడం గమనార్హం.
For More News..