- ఎక్కువగా ఫార్మా, సోలార్ మాడ్యూల్స్ సెక్టార్లోకి
- ఐటీ హార్డ్వేర్, ఆటో, ఆటో కాంపోనెంట్స్ సెక్టార్లోకి తక్కువ
- ప్రభుత్వం ఇచ్చిన రాయితీ రూ.4,415 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించింది. మొత్తం 14 సెక్టార్ల కోసం ఈ స్కీమ్ను ప్రకటించగా, కిందటేడాది డిసెంబర్ నాటికి రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, పెట్టుబడులను ఆకర్షించడంలో ఫార్మా, సోలార్ మాడ్యూల్స్ సెక్టార్లు టాప్లో ఉన్నాయి. ఐటీ హార్డ్వేర్, ఆటో, ఆటో కాంపోనెంట్స్, టెక్స్టైల్స్, ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ సెక్టార్లలో పీఎల్ఐ స్కీమ్కు పెద్దగా రెస్పాన్స్ లేదు.
టెలీకమ్యూనికేషన్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, మెడికల్ డివైజ్ల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ప్రొడక్ట్లు, సోలార్ పీవీ మాడ్యుల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్స్, ఫార్మా వంటి 14 సెక్టార్ల కోసం 2021 లో ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్ను ప్రకటించింది. కిందటేడాది డిసెంబర్ నాటికి ఫార్మాస్యూటికల్ సెక్టార్ రూ.25,813 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇది అంచనా వేసిన రూ.17,275 కోట్లు కంటే ఎక్కువ. డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, గ్లెన్మార్క్ ఫార్మా, బయోకాన్, వోఖ్హర్ట్ లిమిటెడ్ పీఎల్ఐ స్కీమ్ వలన లాభపడ్డాయి.
హై ఎఫీషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ సెక్టార్ రూ.22,904 కోట్లను ఆకర్షించగలిగింది. కానీ, రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సెక్టార్లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాటా పవర్ సోలార్ కంపెనీలు ప్రయోజనం పొందాయి. బల్క్ డ్రగ్స్ సెక్టార్లోకి రూ.3,586 కోట్లు( అంచనా వేసింది రూ.3,939 కోట్లు) వచ్చాయి. మెడికల్ డివైజ్ సెక్టార్లోకి రూ.1,330 కోట్ల పెట్టుబడుల వస్తాయని అంచనా వేయగా, రూ. 864 కోట్లు వచ్చాయి.
స్పందన కరువు
మిగిలిన సెక్టార్లతో పోలిస్తే ఐటీ హార్డ్వేర్ సెక్టార్లోకి పెట్టుబడులు తక్కువ వచ్చాయి. ఈ సెక్టార్లోకి పీఎల్ఐ కింద రూ.2,517 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, కిందటేడాది డిసెంబర్ నాటికి కేవలం రూ.270 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆటో, ఆటో కాంపోనెంట్ సెక్టార్లోకి రూ.67,690 కోట్ల పెట్టబడులు వస్తాయని అనుకుంటే రూ. 13,037 కోట్లు వచ్చాయి.
టెక్స్టైల్స్ సెక్టార్లోకి రూ.3,317 కోట్లు (అంచనా రూ.19,798 కోట్లు), ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ సెక్టార్లోకి రూ.3,236 కోట్లు (అంచనా రూ.13,810 కోట్లు) వచ్చాయి. పీఎల్ఐ స్కీమ్ కొన్ని సెక్టార్లలో సక్సెస్ కాలేదని, రూల్స్ను ప్రభుత్వం సవరించే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కిందటేడాది అక్టోబర్ నాటికి రూ.4,415 కోట్ల రాయితీలను ఎనిమిది సెక్టార్లకు ప్రభుత్వం ఇచ్చింది.
ఎలక్ట్రానిక్స్, ఫార్మా సెక్టార్లో పీఎల్ఐ కింద పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్ వరకు రూ. 1,515 కోట్లను రాయితీగా ఇవ్వగా, 2022–23 లో రూ.2,900 కోట్లు ఇచ్చింది. కాగా, కంపెనీల ప్రొడక్షన్ను బట్టి రాయితీలను పీఎల్ఐ కింద ప్రభుత్వం ఇస్తోంది. కీలక సెక్టార్లలోకి పెట్టుబడులను, టెక్నాలజీని ఆకర్షించడం, లోకల్గా తయారీని పెంచడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.