వ్య‌వ‌సాయానికి రూ. ల‌క్ష కోట్లు..!

వ్య‌వ‌సాయానికి రూ. ల‌క్ష కోట్లు..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల విలువైన అగ్రికల్చర్–ఇన్ఫ్రాస్ట్ర‌క్చర్ ఫండ్ ను ఏర్పాటు చేస్తోంది. కరోనా కారణంగా ఏర్పడ్డ ఎకానమీ క్రైసిస్ నుంచి బయటపడేందుకు ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా దీనిని కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దీనిని లాంఛ్ చేస్తారు. రైతులకు ఇవ్వాల్సిన ఆరోవిడత పీఎం–కిసాన్ యోజన కిస్తీల కోసం రూ.17 వేల కోట్లు కూడా విడుదల చేస్తారు. ఫలితంగా 8.5కోట్ల మంది రైతులకు మేలు జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గత నెలే ప్రకటించింది.

అగ్రి–ఇన్ఫ్రా ఫండ్.. అంటే ఏంటి?

ఆత్మనిర్భర్ భారత్ కింద కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజిలో ఇదొక భాగం. పదేళ్ల పాటు ఈ నిధుల ద్వారా లోన్లు ఇస్తారు. వ్యవసాయరంగ పరిశ్రమలు, స్టార్టప్లు, సామూహిక సాగు చేసే రైతులకూ ఆర్థికసాయం చేస్తారు. ఈ లోన్లకు వడ్డీ మాఫీ ఉంటుంది. రాయితీలూ వర్తిస్తాయి. గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని ప్రైవేటు ఇన్వెస్ట్ మెంట్లను రాబట్టడం, మరిన్ని జాబ్స్ కల్పిం చడం లక్ష్యంగా మోడీ ప్రభుత్వం అగ్రి–ఇన్ఫ్రా ఫండును మొదలుపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేలకోట్లు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియ‌ల్ ఇనిస్టిట్యూషన్లు ప్రైమరీ అగ్రి క్రెడిట్ సొసైటీలకు, రైతు సంఘాలకు, రైతు ఉత్పత్తుల సంఘాలకు, వ్యవసాయ పరిశ్రమలకు, స్టార్టప్లకు, అగ్రిటెక్ కంపెనీలకు లోన్లు ఇస్తాయి. రూ.లక్ష కోట్లలో ప్రస్తుత ఆర్కథి సంవత్సరంలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తారు. మొత్తం నాలుగేళ్ల‌‌లో‌ రూ.లక్ష కోట్లు ఇస్తారు. రాబోయేమూడేళ్ల‌లో రూ.30 వేలకోట్ల చొప్పున లోన్లు మంజూరు చేస్తారు. అన్ని లోన్లపైనా మూడుశాతం వడ్డీ మాఫీ ఉంటుంది. గరిష్ట పరిమితి రూ.రెండు కోట్లు. ఏడేళ్ల పాటు మాఫీ కొనసాగుతుంది.

ఆన్ లైన్ లో మేనేజ్ మెంట్  ఈ ఫండ్ నిర్వహణ అంతా ఆన్లైన్లోనే జరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. ఇందు కోసం ఆన్లైన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)ను ఉపయోగిస్తామని వెల్లడించారు. అర్హులైన అన్ని
కంపెనీలు, రైతు సంఘాలు ఆన్లైన్లోనే లోన్లకు అప్లై చేసుకోవచ్చు. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తాయి, వడ్డీ మాఫీ ఎంత ఉటుంది, క్రెడిట్ గ్యారంటీ అందుబాటు, అందజేయాల్సిన డాక్యుమెంట్లు తదితర వివరాలన్నీ ఇందులోనే ఉంటాయి.లోన్ దరఖాస్తులను ఆన్లైన్లో తొందరగా ప్రాసెస్ చేస్తారని ఈ మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యవసాయరంగ పరిశ్రమలకు, రైతు సంఘాలకు లోన్లు ఇస్తే సాగు విస్తీర్ణం, ఈ రంగంలో పరిశ్రమలు పెరుగుతాయని పేర్కొంది. ఫలితంగా మరిన్ని జాబ్స్ వస్తాయని వివరించింది. ‘‘గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ట్రాన్స్‌‌పోర్ట్ ‌సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సదుపాయాలతో రైతులు తమ పంటలకు మంచి ధర పలికే వరకు వేచిచూసే అవకాశం దొరుకుతుంది. ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుంది ”అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివరించారు.