ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సందర్భంగా గురువారం లోక్ సభలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ప్రతిపక్షాలు మౌనంగా ఉండకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మీ ఇంటికి వస్తుందని హెచ్చరించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి
గురువారం బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశాయి.. దీంతో ఆగ్రహించిన కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ..ఏక్ మినిట్, ఏక్ మినిట్. శాంత్ రహో, తుమ్హారే ఘర్ ఈడీ నా ఆ జాయే (ఒక్క నిమిషం మౌనంగా ఉండండి.. లేదంటే మీ ఇంటికి ED వస్తుంది) అని వార్నింగ్ ఇచ్చారు.
దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. తాము చెప్పిందే ఇపుడు నిజమైందని.. దీనికి మంత్రి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. లేఖి చేసిన వ్యాఖ్యలు హెచ్చరికలా లేక బెదిరింపులా అని ప్రశ్నించారు.