- మలక్ పేట్, కార్వాన్ అసెంబ్లీ స్థానాలపై కమలదళం కన్ను
- ఎంపీ అసదుద్దీన్పై బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు
- స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతో జనాల్లోకి
- పేద ముస్లింలు, మహిళల మద్దతే లక్ష్యంగా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: ‘‘ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తం. 15 మందితో అసెంబ్లీలోకి అడుగుపెడ్తం” అని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనను బీజేపీ చాలెంజ్గా తీసుకుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బలాన్ని పెంచుకునే లక్ష్యంతో ఉన్నామని బాహాటంగా చెబుతున్న ఎంఐఎంను ఎక్కడికక్కడ నిలువరించేందుకు కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్పార్లమెంటు స్థానం పరిధిలోని పాతబస్తీపై స్పెషల్ఫోకస్ పెట్టింది. అక్కడ ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి.. సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవడమే కష్టమనుకునేలా సెల్ఫ్ డిఫెన్స్లో పడేసేందుకు పథక రచన చేస్తోంది. ఓల్డ్ సిటీ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ప్రస్తుతానికి గోషామహల్ ఒక్కటే బీజేపీ చేతిలో ఉంది. మిగతా 6 మజ్లిస్ అకౌంట్లోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మలక్ పేట్, కార్వాన్ అసెంబ్లీ స్థానాలను ఎలాగైనా గెల్చుకొని తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో కాషాయ నేతలు ఉన్నారు. కార్వాన్ గతంలో బీజేపీ సిట్టింగ్ స్థానం. ఈ అంశం తమకు కలిసొస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక మలక్పేట్ సీటు లక్ష్యంగా అక్కడ కార్యక్రమాలను బీజేపీ విస్తృతం చేసింది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీపై గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని కమల దళం భావిస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలిచ్చిన విశ్వాసంతో..
గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పాతబస్తీ ఏరియాలో 10 కార్పొరేటర్ స్థానాలను బీజేపీ గెల్చుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ను జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా నియమించారు. దేశవ్యాప్తంగా పేద ముస్లింల సంక్షేమం కోసం ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలను పాతబస్తీలోని ఇంటింటికి వెళ్లి వివరించే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈవిధంగా పేద ముస్లింలను, ప్రత్యేకించి ముస్లిం మహిళలను పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ట్రిపుల్ తలాక్పై నిషేధం వంటి అంశాలను కూడా బాగా ప్రచారం చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఓల్డ్ సిటీలో నిర్వహించనున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓల్డ్ సిటీలోని కాలాపత్తర్ ఏరియాలో బీజేపీ నిర్వహించిన ఒక ప్రోగ్రామ్ను మజ్లిస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీజేపీ క్యాడర్ ప్రతిఘటించి పార్టీ పట్టును చాటిచెప్పారు.
భాగ్యలక్ష్మి టెంపుల్ వేదికగా..
గత మూడేళ్లలో పార్టీకి సంబంధించిన చాలా కార్యక్రమాలను ఓల్డ్ సిటీ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచే బీజేపీ ప్రారంభించింది. దీంతో అక్కడి క్యాడర్ లో నూతనోత్సాహం వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతర జాతీయ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా పాతబస్తీకి వెళ్లి భాగ్యలక్ష్మి టెంపుల్ ను సందర్శించడం లోకల్ క్యాడర్ నైతిక స్థైర్యాన్ని పెంచింది. ‘పార్లమెంట్ ప్రవాసీ యోజన’లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు రోజుల పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యటించడం బీజేపీ క్యాడర్ లో జోష్ నింపింది. పాత బస్తీకి మెట్రో ట్రైన్వేయాలని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గచ్చిబౌలి, హైటెక్ సిటీ మాదిరిగా పాతబస్తీని కూడా అభివృద్ధి చేస్తామని బీజేపీ నేతలు పదే పదే చెబుతుండటం ఓల్డ్ సిటీ జనాన్ని ఆలోచనలో పడేసింది. ఇలా పాతబస్తీలో పార్టీని విస్తరించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోవడంలేదు.