భారీ వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలమైంది. వరదలతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు ఇంకా వరదనీటిలోనే చిక్కుకున్నాయి. కొన్ని వేల ఇండ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇలా వరదలతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు పక్క రాష్ట్రాల నుంచి చేయూత లభిస్తోంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయక చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి రూ .15 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు హైదరబాద్ పక్షాన నిలబడ్డారని ఆయన అన్నారు. ‘వరదలు వల్ల హైదరాబాద్ నాశనమయింది. ఈ విపత్కర సమయంలో ఢిల్లీ ప్రజలు హైదరాబాద్లోని సోదర సోదరీమణుల పక్షాన నిలబడుతున్నారు. సహాయక చర్యల కోసం ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి రూ. 15 కోట్లు విరాళంగా ప్రకటిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
Floods have caused havoc in Hyderabad. People of Delhi stand by our brother and sisters in Hyderabad in this hour of crisis.
Delhi govt will donate Rs 15 cr to the Govt of Telangana for its relief efforts.
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 20, 2020
వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ కోసం రూ. 15 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు తెలంగాణ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేజ్రీవాల్కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే సోమవారం తెలంగాణకు తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. గతంలో ఎన్నడూ చూడనంత స్థాయిలో హైదరాబాద్ సిటీ వరదలను ఎదుర్కొంటోందని, భారీ వర్షాల కారణంగా వచ్చిన ఈ వరదలతో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తమిళనాడు సీఎం పళనిస్వామి అన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించిందని ఆయన అన్నారు. బాధితులను వేగంగా ఆదుకొని, రిలీఫ్ క్యాంపులకు తరలించడం ద్వారా మరిత నష్టం జరగకుండా చూడగలిగారని అన్నారు. ఈ కష్ట సమయంలో తమిళనాడు ప్రజలు, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని పళని స్వామి తెలిపారు. తమ వంతు తక్షణ సాయంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల విరాళం అందిస్తున్నామన్నారు. అలాగే దుప్పట్లు, చాపలు వంటి రిలీఫ్ మెటీరియల్ కూడా పంపుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే ఎటుంటి సాయం చేసేందుకైనా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని పళనిస్వామి తెలిపారు.