- నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు
- ఢిల్లీ హైకోర్టులో అరుణ్ పిళ్లై
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఆరోపించారు. తన అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ పిళ్లై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సింగిల్ బెంచ్ విచారించింది. పిళ్లై తరఫు అడ్వకేట్ నితీశ్ రాణా వాదిస్తూ..ప్రివెన్షన్ ఆఫ్ మనీలాడరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) సెక్షన్ 19 (1) ప్రకారం తన క్లయింట్ ను అరెస్ట్ చేయడానికి ఎటువంటి లిఖిత, మౌకిక ఆధారాలు అందలేదని కోర్టుకు తెలిపారు.
ఇది రాజ్యంగ పరంగా తన క్లయింట్ కు ఉన్న హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈడీ ప్రతీకార పద్ధతిలో బలవంతపు వ్యూహాలను అనుసరిస్తుందని కోర్టుకు చేప్పారు. పిళ్లైతో పాటు ఇతర నిందితులపై ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని వివరించారు.వాదనపై స్పందించిన ధర్మాసనం.. పిటిషన్ పై ఈడీ తన స్టాండ్ ను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా, మనీలాండరింగ్ కేసులో ప్రత్యక్ష పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు తమ చార్జ్ షీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.