- పరోక్షంగా తన తప్పులు.. తనే బయటపెట్టుకుంటోంది
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ పునరుద్ధరించాలంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదన ఇండియాకే అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడమంటే.. లీగల్గా జమ్మూకాశ్మీర్ ఇండియాదేనని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అంటున్నారు. దేశ విభజన సమయంలో జరిగిన ఒప్పందం సబబేనని పాకిస్తాన్ప్రపంచానికి చాటుతోందన్నారు. జమ్మూకాశ్మీర్ విలీనం సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం ఆ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కల్పించింది. ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, స్పెషల్ పీనల్కోడ్ లతో పాటు ప్రజల జీవనానికి సంబంధించి కాశ్మీర్ ప్రత్యేకతను కలిగి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్కు ఈ స్పెషల్ స్టేటస్ ను పొందుతోంది. ఈ ఒప్పందాన్ని పాక్అప్పట్లోనే వ్యతిరేకించింది. దీనిని గుర్తించబోమని ప్రకటించింది. నిన్న, మొన్నటి వరకూ పాక్ ఇదే స్టాండ్పై ఉంది. అయితే, ఆగస్టు 5న కేంద్రం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాక్ మాటమార్చింది. రద్దు నిర్ణయాన్ని తప్పుబడుతూ, కాశ్మీర్లో అంతకుముందున్న పరిస్థితినే కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒక్క చైనా మినహా మిగతా దేశాలేవీ సమర్థించకపోయినా పాక్ పట్టువీడడంలేదు. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. ఈ ప్రచారం ఇండియాకే లాభిస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
అదెలాగంటే…
- తొలుత జమ్మూకాశ్మీర్, ఇండియాల మధ్య జరిగిన విలీన ఒప్పందాన్ని గుర్తించబోమన్న పాక్ ఇప్పుడు ఆర్టికల్370 రద్దు అన్యాయమని వాదిస్తోంది. అంటే.. ఈ ఒప్పందాన్ని గుర్తించినట్లే. దానర్థం మొత్తం కాశ్మీర్ ఇండియాదేనని అధికారికంగా ఒప్పుకున్నట్లే.
- ఇండియా, పాక్ల మధ్య అసలు వివాదం కేవలం పాక్ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) అంశంపైనేనని ప్రపంచానికి చాటిచెప్పడమే!
- పీవోకేలోని ప్రజలను పాక్ అణిచివేస్తోంది.. పాక్ భూభాగంలోని ప్రజలతో పోలిస్తే పీవోకేలో నివసించే వారు అనేక ఆంక్షల నడుమ బతుకుతున్నారు. కాశ్మీర్కు స్పెషల్స్టేటస్అంశంపై పాక్ చేస్తున్న వాదన పీవోకే కూ వర్తిస్తుంది.
- పాకిస్తాన్ వాదన తన మిత్రదేశం చైనాకూ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. చైనా ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతానికీ పాక్ వాదన వర్తిస్తుంది. అంటే.. పాక్ను సమర్థించడమంటే అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఇల్లీగల్గా ఆక్రమించినట్లు చైనా అంగీకరించినట్లవుతుంది. అందుకే కాశ్మీర్ విషయంలో ముందు పాక్ను సమర్థించిన చైనా.. తర్వాత జోరు తగ్గించింది. ఇండియా, పాక్లు చర్చలతో పరిష్కరించుకోవాలని చెబుతోంది.
- షాక్స్గం వ్యాలీలోని దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాక్ గతంలో చైనాకు బహుమతిగా ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దును తప్పుబట్టడమంటే.. సదరు బహుమతి కూడా అక్రమమేనని స్వయంగా అంగీకరించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. బలవంతంగా ఇతరుల ఆస్తులను స్వాధీనం చేసుకొని, అన్యాయమని తెలిసీ దానిని ఇతరులకు అమ్మడమేనంటున్నారు.
- చివరగా.. కాశ్మీర్ స్పెషల్ స్టేటస్కొనసాగించాలన్న డిమాండ్, లోయలో టెర్రరిజాన్ని ప్రోత్సహించడం వంటి పనులతో.. ఉద్దేశపూర్వకంగానే ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడమే తన పని అంటూ పాక్ తనకుతానుగా ప్రపంచానికి చెప్పుకున్నట్లు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ పరోక్షంగా ఇండియాకు మేలుకలిగించేవేనని అంటున్నారు.
- బోర్డర్లో పాక్ సైన్యాల మోహరింపురాజస్థాన్, సియాల్కోట్-జమ్మూ సెక్టార్ల లో పాకిస్తాన్ సైన్యాన్ని భారీగా మోహరించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర సర్కార్ను హెచ్చరించింది. మనపై టెర్రర్ ఎటాక్ జరిగే అవకాశముందని కూడా ఐబీ వార్నింగ్ ఇచ్చింది. దీంతో బోర్డర్లో మన సైన్యాలను కూడా కేంద్రం అప్రమత్తం చేసింది.